ప్రస్తుతం ప్రపంచమంతా కోవిడ్ 19 మహమ్మారి అంతం కోసం ఎదురుచూస్తుంది. ఇప్పటికే లక్షలాదిమంది కరోనాతో మరణించారు. ప్రపంచమంతా కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో దీనికి సంబంధించిన తప్పుడు సమాచారం వాట్సప్లో మెసేజుల రూపంలో ఇప్పటికి సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ విషయంలో జనాన్ని భయపెట్టేలా ఉన్న మెసేజ్లను ఫార్వార్డ్ చెయ్యవద్దని పోలీసులు మొదటినుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజా ఇలా తప్పుడు సమాచారాన్ని ఫార్వర్డ్ చేసిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఓ ఎలక్ట్రీషియన్. వాట్సాప్ లో తప్పుడు సమాచారాన్ని ఫార్వర్డ్ చేస్తున్నందున రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు.
అతను ఫార్వర్డ్ చేసిన మెసేజ్ల వల్ల అనుచిత ఘటనలు చోటుచేసుకునే ప్రమాదం ఉన్నందున అతనిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. జనాలను భయపెట్టే ఇటువంటి మెసేజులు ఫార్వర్డ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఈ సందర్భంగా తెలియజేసారు. పోలీసులు చెప్తున్న కథనం ప్రకారం సాదిక్ బాషా అనే 29 ఏళ్ళ వ్యక్తి కర్నూలు జిల్లా ఆదోనిలో నివసిస్తున్నాడు. ఇతడు వృత్తిరీత్యా ఒక ఎలక్ట్రీషియన్. ఇటీవల అతడికి వాట్సాప్లో కరోనాకు సంబంధించి రెండు వాయిస్ మెసేజ్లు వచ్చాయట. ఈ మెసేజ్లు ప్రజలను ఇంకా భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయి. ఆ మెసేజులను సాదిక్ తన స్నేహితులు, బంధువులకు వాట్సాప్ లో ఫార్వార్డ్ చేశాడు. చివరికి ఇది పోలీసుల దృష్టికి రావడంతో రాచకొండ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అలా సాంకేతిక సహాయంతో సాదిక్ బాషాను అరెస్ట్ చేసిన పోలీసులు అతనిని విచారణకు పిలిపించారు.