Draupadi Murmu: ద్రౌపది ముర్ము ఇంతకు ముందు వరకూ ఒరిసా రాష్ట్రానికి, జార్ఖండ్ రాష్ట్రానికే తెలుసు. ఒడిసాలో బీజేపీ నాయకురాలుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలు అందించారు. జార్ఘండ్ కు గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు భారతదేశ ప్రధమ పౌరురాలు అవుతున్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేయడంతో దేశ వ్యాప్తంగా ఆమె ఎవరో తెలిసింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే.. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 వసంతాలు దాటినా ఇంకా పలు మారు మూల గ్రామాలు ఇంకా విద్యుత్ వెలుగులు లేక చీకట్లోనే మగ్గుతున్నాయి. ఆ జాబితాలో రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము స్వగ్రామం కూడా ఉండటం గమనార్హం.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Draupadi Murmu: కిరోసిన్ దీపాలే ఆధారం
ఒడిశా రాష్ట్రం మయూర్ భంజ్ జిల్లా కుసుం సమితిలోని ఉపరోబెడ ద్రౌపది ముర్ము స్వగ్రామం. స్వగ్రామం ఉపరోబెడ కాగా ద్రౌపది ముర్మూ దశాబ్దాల క్రితమే స్వగ్రామాన్ని వదిలి రాయ్ రంగపూర్ పట్టణంలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఈ గ్రామంలో ఆమె మేనల్లుడి కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. 3500 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో ఇప్పటి వరకూ విద్యుత్ సౌకర్యం లేదు. ముర్ము మంత్రిగా ఉన్న సమయంలోనూ, ఆ తర్వాత ఓ రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్న సమయంలోనూ అధికారులు విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయలేదు. ఇప్పటి వరకూ గ్రామస్తులు కిరోసిన్ దీపాలపైనే ఆధారపడుతున్నారు.
మీడియా కథనాలతో
ద్రౌపది ముర్ము ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేయడంతో అందరి చూపు ఆమె స్వగ్రామం వైపు పడింది. ముర్ము స్వగ్రామానికి మీడియా వెళ్లడంతో అక్కడి ప్రజల పరిస్థితి లోకానికి తెలిసింది. రాష్ట్రపతి అవుతున్న ద్రౌపది ముర్ము గ్రామంలోనే విద్యుత్ సౌకర్యం లేదని మీడియాలో కథనాలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. విద్యుత్ శాఖ అధికారులు యుద్ద ప్రాతిపదికన ట్రాన్స్ ఫార్మర్ లు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇన్నాళ్లు తమ గ్రామాన్ని పట్టించుకోని అధికారులు ఇప్పుడు ద్రౌపది ముర్ము పుణ్యమా అని విద్యుత్ సరఫరా కల్పిస్తుండటం పట్ల గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సౌకర్యం లేని ఇలాంటి కుగ్రామాలు ఇంకా ఉన్నాయి. ఆ కుగ్రామాలకు కరెంటు రావాలంటే ఆ గ్రామాల నుండి రాష్ట్రపతులు అయితేనే అధికారులు స్పందిస్తారేమో.