DRDO 2DG: కరోనా బాధితులకు మరో మందు అందుబాటులోకి వచ్చేసింది. కోవిడ్ చికిత్సలో ఉపయోగించడం కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన 2డీజీ (2 డియాక్సీ డి గ్లూకోజ్) మందు విడుదలైంది. ఢిల్లీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తొలి బ్యాచ్ 2 డీజీ సాచెట్లను కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ కు అందించారు. ఆరోగ్య మంత్రి వాటిని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాకు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆరోగ్య మంత్రి హర్ష వర్థన్ మాట్లాడుతూ ఈ మందుతో కోవిడ్ రికవరీ సమయం తగ్గడంతో పాటు ఆక్సిజన్ అవసరం కూడా తగ్గుతుందన్నారు. కరోనా మహమ్మారి పై పోరులో డీఆర్డీఓ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.
తొలి విడతగా పదివేల సాచెట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ నెల 27,28 తేదీల్లో రెండవ విడత లో భాగంగా మరిన్ని సాచెట్లను విడుదల చేస్తామని, జూన్ నాటికి పూర్తి స్థాయిలో మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తాయని ఈ మందు ఉత్పత్తి చేస్తున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ తెలిపింది. అయితే దీని ధరను డీఆర్డీఓ ఇంకా ప్రకటించలేదు.
ఈ మందు అత్యవసర వినియోగానికి ఈ నెల 1న డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. కరోనా కట్టడికి డీఆర్డీఓ ఏడాది పాటు కష్టపడి ఈ మందును తీసుకుని వచ్చింది. గతంలో దీన్ని క్యాన్సర్ వ్యాధి కోసం తయారు చేశారు. శరీరంలో క్యాన్సర్ కణాలను గ్లూకోజ్ అందకుండా ఈ మందు అడ్డుకుంటుందని గతంలో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదే సూత్రాన్ని కోవిడ్ కు అన్వయించుకుని పరిశోధనలు ప్రారంభించారు. శరీరంలోకి ప్రవేశించిన కోవిడ్ వైరస్ కణాలకు గ్లూకోజ్ అందకపోతే కణవిభజన జరగదనీ, దాని ఫలితంగా శరీరంలో వైరస్ వ్యాప్తి కూడా ఆగుతుందని శాస్త్రవేత్తలు వివరించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?