ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ఎడిషన్కు గాను టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను ప్రముఖ ఫాంటసీ క్రికెట్ లీగ్ ప్లాట్ఫాం డ్రీమ్ 11 సొంతం చేసుకుంది. మంగళవారం డ్రీమ్ 11 సహా పలు ఇతర కంపెనీలు ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్షిప్ కోసం బిడ్లను సమర్పించగా.. వాటిలో డ్రీమ్ 11కు బిడ్ దక్కింది. ఈ మేరకు ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్గా డ్రీమ్ 11 వ్యవహరిస్తుందని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపారు.
ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్షిప్కు గాను డ్రీమ్ 11 రూ.222 కోట్ల బిడ్ వేసింది. అన్అకాడమీ రూ.210 కోట్లు, టాటా సన్స్ రూ.180 కోట్లు, బైజూస్ రూ.125 కోట్ల బిడ్లను వేశాయి. అయితే ముందు నుంచీ అనుకున్నట్లుగా జియో, పతంజలిలు బిడ్లో పాల్గొనకపోవడం ఆశ్చర్యాన్ని కలిగింది. టాటా సన్స్ సడెన్గా ముందుకు వచ్చే సరికి ఆ రెండు కంపెనీలు బిడ్ నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. అయితే ఓ దశలో టాటా సన్స్కు ఐపీఎల్ 2020 టైటిట్ స్పాన్సర్ షిప్ హక్కులు వచ్చినట్లేనని భావించారు. కానీ ఆ అవకాశాన్ని డ్రీమ్ 11 ఎగరేసుకుపోయింది.
ఇక ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్గా వివో తప్పుకోవడంతో బీసీసీఐకి రూ.440 కోట్లు నష్టం వస్తుందని భావించారు. కానీ ఇప్పుడు డ్రీమ్ 11 ఈ ఎడిషన్కు టైటిల్ స్పాన్సర్గా వస్తుండడంతో బీసీసీఐకి రూ.222 కోట్లు రానున్నాయి. అయినప్పటికీ బీసీసీఐకి దీని వల్ల సగం వరకు నష్టమే కలుగుతుందని చెప్పవచ్చు. కాగా ఐపీఎల్ 13వ ఎడిషన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు దుబాయ్లో జరగనుంది.