కాంగ్రెస్ పార్టీని వీడినందుకు పిసిసి మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ ఇన్నాళ్లకు పశ్చాత్తాపం చెందారు.కేసీఆర్ తనను ట్రాప్ చేశాడని ఆయన చెప్పారు.
‘కొంతమంది ఒత్తిడి వల్లే కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చింది. పార్టీని వీడడం పొరపాటే. కేసీఆర్ స్వయంగా ఫోన్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని డిఎస్ తన డెబ్బై మూడో జన్మదినోత్సవ సందర్భంగా మీడియా చిట్చాట్లో పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన తన పూర్వ అనుభవాలను నెమరేసుకున్నారు కాంగ్రెస్ పార్టీలో కూడా తనకు అన్యాయం జరిగిందని చెప్పారు.నేను వైఎస్ పార్టీ సీనియర్లతో కలిసి కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చినం. ఆ వాస్తవాన్ని సోనియా కూడా గ్రహించారు. 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ఫుల్ ఫిల్ చేయలేదు. వైఎస్ సీఎం అని ఎన్నికల ముందే సోనియా నాకు చెప్పారు. తర్వాత నేను వైఎస్ ఎంతో సన్నిహితంగా ఉన్నాం.
2009 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చాం. కానీ దురదృష్టం కొద్దీ ఆ ఎన్నికల్లో నేను ఓడిపోయాను. లేదంటే నేనే సీఎం అయ్యేవాడిని’ అని అన్నారు.అయితే తెలంగాణ కోసం తాను పోరాడానని ఆ విషయం సిఎం కెసిఆర్ కి కూడా తెలుసునన్నారు.ఈ విషయంలోనే తనను మభ్యపెట్టి కెసిఆర్ టిఆర్ఎస్లోకి రప్పించుకున్నారని ఆయన చెప్పారు.కాంగ్రెస్ పార్టీని మరింత బలహీన పరచడానికి అప్పట్లో కెసిఆర్ తనను పావులా వాడుకున్నారన్నారు.టిడిపి పార్టీని కూడా ఇలాగే ఆయన నిర్వీర్యం చేశారన్నారు.టీఆర్ఎస్లో కేసీఆర్ ఎవరినీ ఉండనివ్వడు. తానే ఉండాలనుకుంటాడని డీఎస్ ఆరోపించారు.అరేండ్లుగా రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కి పోతోంది. స్కీమ్లతోనే ఓట్లు తెచ్చుకోవాలనే పాలన సాగుతోంది. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోంది’ అంటూ మండిపడ్డారు.
కూతురు కవిత ఫిర్యాదు చేసినంత మాత్రాన కెసిఆర్ నన్ను అనుమానిస్తాడా అని అయన నిలదీశారు రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడంలేదని టీఆర్ఎస్ కార్యకర్తలూ మధనపడుతున్నారని చెప్పారు.అన్నీ తెలిసిన తానే వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నానని డిఎస్ చెప్పుకొచ్చారు.తాను రాజకీయాలనుంచి చనిపోయే నిమిషం వరకు రిటైర్ కానని కూడా డీఎస్ ప్రకటించారు. తానేమిటో త్వరలోనే రుజువు చేసుకుంటానని ఈ సీనియర్ నేత చెప్పారు. టీఆర్ఎస్ను వీడేది లేదంటూనే భవిష్యత్తులో ఏ పార్టీలో ఉంటానో తర్వాత చెబుతాననడం ఇక్కడ కొసమెరుపు.ప్రధాని మోడీ పాలన బాగుందని డిఎస్ సర్టిఫికెట్ ఇచ్చారు మరి ఆయన ఏం చేస్తారో వేచి చూడాలి!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?