DSP: సహజంగా పోలీసులను చూసి దొంగలు పారిపోతుంటారు, వాహనాల తనిఖీ సమయంలో డ్రైవింగ్ లైసెన్సు లేని వారో లేక మద్యం సేవిస్తూ వాహనాలు నడిపేవారో పోలీసులను చూసి పరారు అవుతుంటారు. కానీ మఫ్టీలో ఉన్న పోలీసులను చూసి ఓ పోలీసు అధికారే కారు దిగి పరుగు లంకించుకున్న ఘటన ఇది. ఒ రహదారిపై పోలీసులు వాహనాల తనిఖీ జరుగుతుండగా అటుగా కారులో వస్తున్న డీఎస్పీ కారు దిగి పరుగు లంకించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రోడ్డుపై పరుగులు తీస్తున్న డీఎస్పీని పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. తరువాత అసలు మేటర్ తెలిసింది. వాస్తవానికి ఆయన భయపడకుండా ముందుకు వెళితే అక్కడ తనిఖీ చేసే దిగువ స్థాయి అధికారులు ఎవరూ ఆయన కారును టచ్ చేసే వారు కూడా కాదు. కానీ ఆ డీఎస్పీ తనిఖీకి భయపడి పరుగు లంకించుకున్నారు.
విషయం ఏమిటి? అక్కడ ఏమి జరిగింది ? అంటే.. తిరుచ్చి విమానాశ్రయం సమీపంలో పుదుక్కొట్టై ప్రధాన రహదారిపై పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వేగంగా వచ్చిన ఒ కారు పోలీసులకు కొద్ది దూరంగా ఆగింది. దానిలో నుండి ఓ వ్యక్తి దిగి పరుగులు పెట్టాడు. అయితే ఇది గమనించిన పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. పరుగెత్తిన వ్యక్తి డీఎస్పీ అని, స్నేహితులతో కలిసి రూ.11 లక్షల నగదును తీసుకొని తిరుచ్చికి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. అనంతరం సదరు డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ తనిఖీ కేంద్రం వద్ద మఫ్టీలో ఉన్న పోలీసులను చూసి తాను విజిలెన్స్ అధికారులు అనుకున్నాననీ, తమ వద్ద ఉన్న డబ్బుకు తగిన ఆధారాలు లేకపోవడం వల్ల పరుగెత్తినట్లు చెప్పారు.
అయితే అక్కడి పోలీసులు మాత్రం డీఎస్పీతో పాటు అతని ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఆ మొత్తం నగదు ఎక్కడి నుండి వచ్చింది అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారి వద్ద 11 లక్షల రూపాయలు బ్లాక్ మనీ కావడంతో ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.