(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
దుబ్బాక ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాసరావుకు ఖరారు అయ్యింది. తెలంగాణ పీసీసీ పంపిన ప్రతిపాదన మేరకు శ్రీనివాసరెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఖరారు చేశారు. దీంతో పార్టీ అధిష్టానం శ్రీనివాసరెడ్డి పేరును అధికారికంగా ప్రకటించింది.
శ్రీనివాసరెడ్డి నిన్ననే టీఆర్ఎస్కి రాజీమానా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరకముందు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే టి నర్సారెడ్డిని దుబ్బాక ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించాలని పార్టీ భావించింది. ఇటీవల రాష్ట్ర పార్టీ ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ సమక్షంలో జరిగిన ముఖ్యనేతల సమావేశంలో పార్టీ అభ్యర్థి గురించి చర్చించి నర్సారెడ్డికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే దుబ్బాక నియోజకవర్గంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కోవాలని భావించి ఆ పార్టీ నుండి వచ్చిన చెరుకు శ్రీనివాసరెడ్డికి టికెట్ ఖారారు చేసింది కాంగ్రెస్ పార్టీ.
నవంబర్ 3వ తేదీన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా ఈ నెల 9వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది. టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత పేరును, బీజెపీ అభ్యర్థిగా రఘునందరావులను ఆయా పార్టీలు ఖరారు చేశాయి.