కరోనా మహమ్మారి భయంతో మనుషులు మూగజీవాలకు హాని చేస్తున్నారు. మనుషులు వారు సర్వైవ్ కావడానికి ఎంతకైనా తెగిస్తుంటారు అనేందుకు ఇది ఉదాహరణ.
ఓ పక్క ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కరోనా వైరస్ గడగడ లాడిస్తోంది. చైనాలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు విస్తరించడంతో 69 లక్షల మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. 4 లక్షల మందికి పైగా చనిపోయారు. అయితే గబ్బిలాల మూలంగా ఈ వైరస్ సోకుతుందని తెలియడంతో చాలా గబ్బిలాలను హతమార్చారు. ఆ తరువాత పెంపుడు జంతువుల వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందని ప్రచారం జరగడంతో లక్షలాది పెంపుడు జంతువులను వాటి యజమానులు రోడ్డు పాలు చేశారు. దింతో చాలా చనిపోయాయి. ఆ తరువాత పెంపుడు జంతువుల వల్ల కరోనా రాదని వైద్య నిపుణులు వెల్లడించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మూగజీవాలపై వివక్షత మానుకున్నారు.
అయితే నెదర్లాండ్ వాసులకు భయం మాత్రం పోలేదు. కరోనా భయంతో అక్కడి ప్రభుత్వం అమానుషానికి దిగుతోంది. మింక్ లు (కుందేలు లాంటి జంతువు) ద్వారా ఇప్పటి వరకు ఇద్దరు వ్యక్తులకు కరోనా వ్యాప్తి చెందినట్లు ప్రభుత్వం గుర్తించింది. వాటి వల్ల మానవులకు వైరస్ ముప్పు పొంచి ఉందని భావించిన ప్రభుత్వం మింక్ లను హతమార్చాలని ఆదేశించింది. దేశంలో సుమారు 10 వేల మింక్ లను సంహరించేందుకు సిద్ధమయ్యారు.