అమరావతి, ఫిబ్రవరి 21: ఓటర్ల జాబితాపై నిరాధార వార్తలను ప్రజలు నమ్మవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. అమరావతిలో గురువారం ఆయన మిడియాతో మాట్లాడారు.
ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని వస్తున్న ఆరోపణలను ద్వివేది ఖండించారు. ఎన్నికల నాటికి తప్పులన్నీ సరి చేస్తామని ద్వివేది చెప్పారు. ఓట్ల తొలగింపు అవాస్తవమని, అలాంటి వార్తలు నమ్మవద్దని ద్వివేది అన్నారు.
ఈ నెల 23,24 తేదీల్లో బూత్ స్థాయి అధికారులతో ప్రత్యేక క్యాంప్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఫారం 6,7,8తో పాటు ఓటర్ల జాబితాతో బూత్ స్థాయి అధికారులు వస్తున్నారని ద్వివేది తెలిపారు. వీటిపై అనుమానాలు ఉన్నవారు, ఓటర్ల జాబితాలో నమోదు కాని వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ద్వివేది సూచించారు. అన్ని పార్టీలు కూడా తమ ఏజంట్లను ప్రత్యేక క్యాంపుల వద్ద పెట్టుకోవాలని ద్వివేది కోరారు.
ఇప్పటికే ఈవీఎంలు పరిశీలన జరిపామనీ, ఇంకా కొన్ని ఈవీఎంల పరిశీలన జరుగుతోందని ద్వివేది తెలిపారు.
ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చూసేందుకు వెబ్ కెమెరాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండదనీ, పూర్తి పారదర్శకతతో జరుగుతుందని ద్వివేది స్పష్టం చేశారు.
ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు ప్రక్రియ అభ్యర్ధి నామినేషన్ వేసే ముందు రోజు వరకూ జరుగుతూనే ఉంటుందని ఆయన వెల్లడించారు. 13 జిల్లాల్లో పారదర్శకంగా ఈవిఎంలను సిద్దం చేస్తున్న ప్రక్రియనీ, వెబ్ కెమెరాల ద్వారా లైవ్ విజువల్స్ను సచివాలయం ఐదో బ్లాకులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విలేకరులకు ద్వివేది చూపించారు.
ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు వెబ్ కెమెరాల ద్వారా లైవ్ ఇస్తున్నామని ద్వివేది వెల్లడించారు
ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యిందనీ, దీనికి ఎన్నికల కోడ్ వర్తించదని ద్వివేది తెలిపారు.
ఈ నెల 20,21,22వ తేదీల్లో కేంద్ర ఎన్నికల అధికారులు పలు జిల్లాల్లో పర్యటించి ర్యాండమ్ గా పరిశీలన జరుపనున్నారని ద్వివేది చెప్పారు.
ఓట్లు నమోదు చేసుకున్న కొత్త వారికి మార్చి పదవ తేదీ నాటికి ఓటరు కార్డులు పంపిస్తామని తెలియజేశారు.
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అధికారులు.. కావాలని తప్పులు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ద్వివేది హెచ్చరించారు.
రాష్ట్రం మొత్తం మీద జనవరి 11వ తేదీ నాటికి మూడు కోట్ల 69 లక్షల ఓట్లు ఉన్నాయని, వీటిలో లక్షా 55 వేల ఓట్లు రెండు సార్లు నమోదు అయ్యాయని, మరో 13 వేల ఓట్లలో తప్పులు ఉన్నాయని ద్వివేది తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓటు ఉన్న వారిపై కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుంటుందని, ఈ సమస్య దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉందని ద్వివేది గుర్తు చేశారు.