అమరావతి : కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ రాష్ట్రంలోని పలు జిల్లాలో పాజిటివ్ కేసులు రోజు రోజుకు అధికం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్.. కంటైన్మెంట్ జోన్ లకు మాత్రమే పరిమితం చేసి ఇతర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందనే మాట వినిపిస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న వేళ మళ్ళీ లాక్ డౌన్ దిశగా వెళ్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఇప్పటికే ప్రకాశం జిల్లాలో ఈ నెల 21వ తేదీ నుండి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. ఆ జిల్లా కలెక్టర్ 14 రోజుల పాటు లాక్ డౌన్ అమలులో ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే విధంగా అనంతపురం జిల్లా లోని పలు ప్రాంతాల్లోనూ లాక్ డౌన్ అమలునకు కలెక్టర్ చర్యలు చేపట్టారు.
ఇప్పుడు తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోనూ లాక్ డౌన్ విధిస్తున్నారు. ఈ జిల్లాలో గడచిన 24గంటల వ్యవధిలో 87 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఈ నెల 25వ తేదీ నుండి జిల్లా మొత్తం లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందన్నారు. ఉదయం 6 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు మాత్రమే వ్యాపార వాణిజ్య సంస్థలు నిర్వహించుకోవచ్చని, ఆ సమయంలో మాత్రమే ప్రజలు రోడ్లపైకి రావచ్చని చెప్పారు. కొనుగోళ్ల వద్ద భౌతిక దూరం పాటించాలని, విధిగా మాస్క్ లు ధరించాలని చెప్పారు. ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లాలో 706 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
మరో పక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా కేసుల పెరుగుదలపై ఉన్నతాధికారులతో సమీక్షలు జరిపి తదనుగుణంగా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.