కర్నాటక, జనవరి 26: కర్నాటకలో ఆలయం బయట పంపిణీ చేసిన ప్రసాదం వికటించి ఒకరు మరణించగా మరో 11మంది భక్తులు ఆస్పత్రి పాలయ్యారు. చిక్బళ్ళాపూర్ జిల్లాలోని గంగమ్మదేవి ఆలయం బయట ప్రసాదం స్వీకరించిన కవిత(28) కడుపునొప్పితో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం మరణించారు. ఈ సంఘటనలో మరో 11 మంది కడుపునొప్పి, వాంతులతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.
బెంగుళూరుకు 70 కిలోమీటర్ల సమీపంలోని చింతామణి తాలూకాకు చెందిన ఇధ్దరు మహిళలు ఆలయం వద్ద హల్వాను ప్రసాదంగా శుక్రవారం పంపిణీ చేశారు. ఈ ప్రసాదం తీసుకున్నవారికి వెంటనే కడుపునొప్పి రావడంతో దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
ఈ సంఘటనపై ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ సంఘటనకు కారణంగా భావిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు చిక్బళ్ళాపూర్ ఎస్పి కార్తీక్ రెడ్డి తెలిపారు.
గత ఏడాది డిసెంబరులో ఛామరాజనగర్లోని ఒక దేవాలయం వద్ద ప్రసాదం తీసుకుని 17 మంది భక్తులు చనిపోగా, 100 మంది ఆస్పత్రి పాలయ్యారు. ప్రసాదం తయారు చేసేటప్పుడు పురుగుమందులు కలిసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆలయ పూజారితో పాటు మరో ముగ్గురిని ఈ కేసులో పోలీసులు అరెస్టు చేశారు.