అమరావతి: ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధకశాఖ (ఏసిబి) డైరెక్టర్ జనరల్ (డిజి)గా శంకబ్రత బాగ్చిని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం బాగ్చి అవినీతి నిరోధక శాఖలో డైరెక్టర్గా పని చేస్తున్నారు. ఈ విభాగంలో బాగ్చినే సీనియర్ అధికారి. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పునేఠా ఉత్తర్వులు ఇచ్చారు.
అదే సమయంలో ప్రస్తుతం ఏసిబి డిజిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ డిజిపి ఆర్పీ ఠాకూర్ను తక్షణం ఆ విధుల నుంచి తప్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘంతో డిజిపి భేటీ అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. ఎన్నికల సంఘం పిలుపు మేరకు ఆర్పీ ఠాకూర్ గురువారం ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే.
డిజిపి ఆర్పీ ఠాకూర్నే ఇప్పటి వరకూ ఏసిబి డిజిగా అదనపు భాద్యతలు నిర్వర్తిస్తున్నారు.