Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల ప్రచార పర్వం ఉదృతంగా జరుగుతున్న వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఆయనకు నిషేదం విధించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న 48 గంటల పాటు జగదీశ్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదంటూ సీఈసీ నిషేదం విధించింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఓటర్లను బెదిరించేలా ప్రసంగాలు చేశారన్న అభియోగాలు వచ్చిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తీసుకున్నట్లు తెలిపింది. ఈ సాయంత్రం నుండి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నట్లు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులో పేర్కొంది. జగదీశ్ రెడ్డి ఎలాంటి బహిరంగ సభల్లో, ప్రదర్సనలు, ర్యాలీ, రోడ్ షోల్లో పాల్గొనకూడదని మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వకూడదని తెలిపింది.
మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ నవంబర్ 3వ తేదీ జరగనుండగా, ప్రధాన రాజకీయ పార్టీలు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్ధి కే ప్రభాకరరెడ్డి విజయం కోసం మంత్రి జగదీశ్ రెడ్డి అన్ని తానే అయి ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. పలువురు మంత్రులు మండలాలకు ఇన్ చార్జిగా పార్టీ ఆదేశాల మేరకు పని చేస్తున్నారు. ఈ తరుణంలో జగదీశ్ రెడ్డి ప్రచారం నిర్వహించకుండా ఈసీ నిషేదం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
మరో పక్క బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి రెడ్డి లు, ఆ పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారాలను నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో బిజీగా ఉన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్ధుల ప్రచారానికి భిన్నంగా స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో ఉన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విన్నూత్నంగా ప్రచారాన్ని నిర్వహిస్తూ ప్రజలకు హస్యాన్ని అందిస్తున్నారు. ప్రజలకు ఆయన రకరకాల హామీలు ఇస్తున్నారు.