హైదరాబాదు, ఫిబ్రవరి 9: వికారాబాద్ కలెక్టర్ ఉమర్ జలీల్పై ఎన్నికల సంఘం వేటు వేసింది. హైకోర్టు స్టే ఉన్నా వీవీ ప్యాట్లు, ఈవిఎంలను తెరిచారన్న ఆరోపణలపై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది.
ఈవిఎంల హాకింగ్ వల్లే ఓడిపోయామని కొడంగల్, పగిరి, వికారాబాద్ నియోజకవర్గాల కాంగ్రెస్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
కేసు కోర్టులో ఉండగానే బెంగళూరుకు నుండి వచ్చిన భెల్ కంపెనీ ఇంజనీర్లు ఈ నియోజకవర్గాలకు చెందిన వందకు పైగా ఈవిఎంలను కలెక్టర్ సమక్షంలో తనిఖీ చేశారు.
కేసు కోర్టులో ఉండగానే ఈవిఎం సీళ్లు తీయడంపై కాంగ్రెస్ నేతలు ఈసికి ఫిర్యాదు చేశారు.
లోక్ సభ ఎన్నికలకు ఈవిఎంలను సిద్ధం చేయడంలో భాగంగానే తనిఖీలు నిర్వహించినట్లు అధికార యంత్రాంగం ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చిందని సమాచారం. కలెక్టర్ ఉమర్ జలీల్ ఇచ్చిన సమాధానంపై ఎన్నికల సంఘం సంతృప్తి చెందలేదు.
సస్పెన్షన్ ఉత్తర్వులు సాయంత్రంలోగా ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్నికల సంఘం ఆదేశించింది.