న్యూఢిల్లీ: హైదరాబాదీ వ్యాపారవేత్త సానా సతీష్ బాబును ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అరెస్టు చేసింది. ఇడి శుక్రవారం సతీష్ బాబును పిలిపించి ప్రశ్నించింది. అతను విచారణకు సహకరించడం లేదని రాత్రికి అరెస్టు చేశారు. శనివారం ఢిల్లీ కోర్టులో హజరుపరిచారు. అయిదు రోజుల పాటు సతీష్ బాబును ఇడి కష్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. వివాదాస్పద మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీకి సంబంధించిన హవాలా కేసులో సతీష్ బాబును అరెస్టు చేశారు.
గత సంవత్సరం సిబిఐలో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య వచ్చిన వివాదంలో సానా సతీష్ బాబు పాత్ర ఉంది. సిబిఐ డైరక్టర్ అలోక్ వర్మ, సిబిఐ స్పెషల్ డైరక్టర్ రాకేష్ ఆస్థానా మధ్య ఈ వివాదం చోటుచేసుకుంది. మొయిన్ ఖురేషీ కేసు దర్యాప్తు చేస్తున్న రాకేష్ ఆస్థానా సతీష్ బాబును అరెస్టు చేయాలన్నారు. సతీష్ బాబు ఈలోపు ఆస్థానాపై అవినీతి ఆరోపణలు చేశారు.
అయితే దానికి ముందే ఆస్థానా, అలోక్ వర్మపై క్యాబినెట్ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. సతీష్ బాబు దగ్గర డబ్బు తీసుకుని అలోక్ వర్మ అతనిని రక్షిస్తున్నాడన్నది ఆ ఫిర్యాదు సారాంశం. చివరికి ప్రభుత్వం ఈ ఇద్దరు అధికారులనూ పదవి నుంచి తప్పించింది. తర్వాత అలోక్ వర్మను ఉద్యోగం నుంచి తొలగించారు. ఆస్థానాను పౌర విమానయాన భద్రతా విభాగం చీఫ్గా నియమించారు.