శివసేన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ నివాసంపై ఈడీ అధికారులు దాడులు చేశారు. పత్రాచల్ లాండ్ స్కామ్ కేసులో ఆధారాల కోసం ఆదివారం ఉదయం నుండి ముంబైలోని సంజయ్ రౌత్ నివాసంతో పాటు ఆయనకు చెందిన మరో రెండు ప్రదేశాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి సంజయ్ రౌత్ ను విచారించే అవకాశం ఉందని ఈడీ వర్గాలు వెల్లడించాయి.
మనీలాండరింగ్ వ్యవహారంలో విచారణకు హజరు కావాలని సంజయ్ రౌత్ కి ఇప్పటికే ఇడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీ కార్యాలయానికి రావాలని ఈడీ పేర్కొంది. అయితే పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో తాను ఆగస్టు 7వ తేదీ వస్తానంటూ సంజయ్ రౌత్ ఈడీ అధికారులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు ఈ రోజు ఆయన ఇంటికి వెళ్లి సోదాలు జరుపుతోంది. ఈ నెల 1వ తేదీన ఈడీ ముందు సంజయ్ రౌత్ హజరు కాగా దాదాపు పది గంటల పాటు ప్రశ్నించారు ఈడీ అధికారులు. పత్రాచల్ లాండ్ స్కామ్ కేసులో ఇప్పటికే దాదర్, ఆలిబాగ్ లోని ఆయన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.
ఈ దాడులు రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమేనని సంజయ్ రౌత్ ఆరోపించారు. ఈడీ అధికారుుల తన ఇంటిపైకి వచ్చిన కొద్ది సేపటికి సంజయ్ రౌత్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనకు ఎలాంటి స్కామ్ తో సంబంధం లేదనీ, తప్పుడు ఆరోపణలతో వేధింపులకు గురి చేసినా తాను శివసేనను వీడనని ప్రమాణం చేసి చెబుతున్నానని పేర్కొన్నారు సంజయ్ రౌత్. శివసేన అధినేత బాలాసాహెబ్ ఠాక్రే..తమకు పోరాడటం నేర్పించారు. తాను శివసేన కోసం పోరాడుతూనే ఉంటానని ట్వీట్ చేశారు.