ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు నేడు హజరు కావాల్సిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చివరి నిమిషంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చి విచారణకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ రోజు విచారణకు హజరు కావాలని శుక్రవారం ఈడీ రోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేయగా, తొలుప ఈడీ విచారణకు హజరు అవుతున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. ఈ రోజు ఉదయం ఈడీ విచారణ కోసం బయలుదేరిన రోహిత్ రెడ్డి ముందుగా ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసిఆర్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత తాను విచారణకు ఈ రోజు హజరు కాలేననీ, కొంత సమయం కావాలంటూ ఈడీకి రోహిత్ రెడ్డి లేఖ పంపారు.
తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఆస్తులు, వ్యాపారాలు, బ్యాంక్ ఖాతా వివరాలు అనేక వివరాలు సేకరించాలంటే తనకు కొంత సమయం కావాలనీ, ప్రస్తుతం తాను అయ్యప్ప దీక్షలో ఉన్నాననీ, వచ్చే నెలలో విచారణకు హజరు అవుతానని రోహిత్ రెడ్డి ఈడీకి పంపిన లేఖలో పేర్కొన్నారు. ఈడి స్పందన కోసం రోహిత్ రెడ్డి .. ప్రగతి భవన్ లోనే ఉండిపోయారు. అయితే రోహిత్ రెడ్డి అభ్యర్ధనను ఈడీ తోసి పుచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని, అందుబాటులో ఉన్న సమాచారంతో విచారణకు హజరు కావాలని ఈడీ అధికారులు తెలియజేశారు. ఈడీ ఆదేశాలతో రోహిత్ రెడ్డి ఈ మధ్యాహ్నం విచారణకు హజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.