పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా లోని ఓ వ్యాపారవేత్త నివాసాల నుండి ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న కట్టల కొద్దీ నగదును లెక్కించడానికి దాదాపు 16 గంటల సమయం పట్టింది. 8 కౌంటింగ్ యంత్రాలతో బ్యాంకు, దర్యాప్తు సంస్థ అధికారులు నగదును లెక్కించారు. గార్డెన్ రీచ్ ప్రాంతంలోని వ్యాపారవేత్త అమీర్ ఖాన్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. మొత్తం 17 కోట్ల నగదును ఈడీ స్వాాధీనం చేసుకుంది. రూ.2వేలు, రూ.200 నోట్లతో పాటు రూ.500 డినామినేషన్ నోట్లు ఎక్కువగా ఉన్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ‘ఈ నగ్లెట్స్’ అనే మొబైల్ గేమింగ్ యాప్ ను తయారు చేసి అమీర్ ఖాన్, అతని అనుచరులు భారీ మోసానికి పాల్పడ్డారు. చాలా మంది నుండి డబ్బులు వసూలు చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. గత ఏడాది ఫిబ్రవరి 15న కోల్ కతాలోని పార్క్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో అమీర్ ఖాన్ పై కేసు నమోదు అయ్యింది.
ఆన్ లైన్ గేమింగ్ యాప్ ద్వారా తొలుత వినియోగదారులకు రివార్డులు, కమీషన్ ఇచ్చారు. బ్యాలెన్స్ డబ్బులను వ్యాలెట్ ద్వారా తీసుకునే సౌకర్యం కల్పించారు. దీంతో నమ్మకంతో యూజర్లు భారీగా కమీషన్ల కోసం పెద్ద ఎత్తున డబ్బులతో ఆర్డర్లు కొనుగోలు చేశారు. ఇలా ప్రజల నుండి కోట్లలో డబ్బులు జమ అయిన తర్వాత ఒక్కసారిగా డబ్బులు విత్ డ్రాను స్టాప్ చేశాడు. సిస్టమ్ సర్వర్ అప్ గ్రేడ్ పేరుతో ప్రొఫైల్స్ తో పాటు డాటా అంతా తొలగించాడు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అమీర్ ఖాన్ తదితరులపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రధాన నిందితుడైన అమీర్ ఖాన్ నివాసాల్లో సోదాలు జరిపి రూ.17కోట్ల నగదును, ఇతర ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది ఈడీ.