పత్రికలంటే సామాజిక ప్రయోజనాలను ప్రతిబింబించాలి. జర్నలిజం చదివే వారికి మొదటి తరగతిలోనే ఈ విషయం చెబుతారు. అయితే ప్రస్తుతం జర్నలిజం అంటే ఎలా మారిపోయిందో అందరికీ తెలుసు. ఒక పత్రికలో లేదా చానల్లో పనిచేసే సగటు జర్నలిస్టుకు తమ సంస్థ చెప్పేదే వేదం. ఎందుకంటే జీతం ఇచ్చి పోషించే సంస్థ కదా. అందుకని సంస్థ చెప్పిన విధంగా జర్నలిస్టులు రాయాల్సిందే. తమకు మనస్కరించకపోయినా సరే.. తమ సంస్థల మనోభావాలనే వారు రాయాల్సి ఉంటుంది. కానీ ఆ సంస్థలు మాత్రం సామాజిక ప్రయోజనాలకు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చేశాయి.
మీడియా సంస్థల్లో రాజకీయ పార్టీల ప్రాబల్యం పెరిగినప్పటి నుంచి వాటి వాణినే ఆ సంస్థలు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవలి కాలంలో ఆ సంస్థలు రాజకీయ పార్టీల వాణితోపాటు.. సామాజిక వర్గ ప్రయోజనాలకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ వార్తలను ప్రచురిస్తున్నాయి. అందుకు అమరావతిలో 200 రోజులుగా జరుగుతున్న ఉద్యమాలు, ఆందోళనలను ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఈ వార్తలకే కొన్ని పత్రికల్లో ప్రస్తుతం అగ్రతాంబూలం ఇస్తున్నారు. ఆ వార్తలనే ఆయా పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో ప్రచురిస్తున్నారు. అయితే పత్రికల నిర్వహణ చాలా ఖరీదైన వ్యవహారంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా సంస్థలు తమకు వస్తున్న భారీ నష్టాలను సైతం తట్టుకుని అలాంటి వార్తలను ఎలా ప్రచురిస్తున్నాయనేది ఇప్పుడు సందేహంగా మారింది.
సాధారణంగా పత్రికలకు ప్రకటల నుంచి వచ్చే ఆదాయమే ప్రధాన ఆర్థిక వనరు. దాంతోనే అనేక పత్రికలు మనుగడ కొనసాగిస్తుంటాయి. ఒక్కో పత్రిక తమకు అయ్యే ఉత్పాదక వ్యయంలో మూడో వంతు ఖరీదుతో తమ పత్రికలను విక్రయిస్తుంటాయి. అంటే పత్రికలకు వచ్చేది నష్టమే. కానీ దాన్ని ప్రకటనలు భర్తీ చేస్తాయి. అయితే ఏ పత్రిక అయినా తాము కోరుకున్న పార్టీయే అధికారంలో ఉండాలని కోరుకుంటుంది. అది సహజమే. ఆ పార్టీ అధికారంలో ఉంటే తమకు ఆర్థికంగా ఇబ్బందులు ఉండవని వారు భావిస్తారు. కానీ తమకు వ్యతిరేకమైన పార్టీ అధికారంలో ఉంటే అప్పుడు వారు మనుగడ సాగించడం కొంత ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు పత్రికలకు గుర్తుకు వచ్చేది తమ సొంత వర్గమే. వారే తమను ఆదుకుంటారు. కనుక పత్రికలు తమ వర్గాన్ని పరిపుష్టం చేసేందుకు అవసరం అయ్యే వార్తలను వండి వడ్డిస్తాయి. దాంతో తమ ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ప్రస్తుతం అమరావతి ఉద్యమం నేపథ్యంలో వస్తున్న వార్తలను ఇవే కోవకు చెందినవిగా అర్థం చేసుకోవచ్చు. ఆయా పత్రికలు ఏ ప్రయోజనాలను పొందడం కోసం ఇలా వార్తలను ఇస్తున్నాయనే విషయం మనకు ఇట్టే అర్థమవుతుంది.
పత్రికలు తాము కావాలనుకున్న పార్టీలు అధికారంలోకి రాలేకపోతే.. తమ సామాజిక వర్గ ప్రయోజనాలకు ఇబ్బంది కలిగినట్లు భావిస్తాయి. ఆయా పార్టీలకు ఎన్నికల్లో దెబ్బ పడడం, అవి అధికారానికి దూరంగా ఉండడంతో.. పత్రికలు మేల్కొని ఆయా పార్టీలను గట్టెక్కించడానికి యత్నిస్తాయి. అందుకనే అవి ప్రజలను ఏదో ఒక అంశంపై ఎప్పుడూ యాక్టివ్గా ఉంచుతాయి. ప్రస్తుతం ఈనాడు, ఆంధ్రజ్యోతిలలో పెద్ద ఎత్తున అమరావతి వార్తలు వస్తుండడాన్ని చూస్తే అవి ప్రజలను ఏమేర తమ వైపు, తమ సామాజిక వర్గం వైపు తిప్పుకోవడానికి యత్నిస్తున్నాయో ఇట్టే అర్థమవుతుంది. పత్రికలు జనాలను మభ్య పెట్టడంలోనూ ముందే ఉంటాయి. ఓ వర్గానికి ఏర్పడ్డ నష్టాన్ని సమాజానికి కలిగిన నష్టంగా అభివర్ణిస్తాయి.
అయితే అమరావతి ఉద్యమం నేపథ్యంలో వస్తున్న వార్తలు సమాజ ప్రయోజనానికే అని కొంత సేపు అనుకుంటే.. మరి సమాజంలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి కదా.. వాటి గురించి ఎందుకు ఆ పత్రికలు పట్టించుకోవు ? సమాజంలో అన్ని వర్గాలు ఉంటాయి. ఆ వర్గాలకు చెందిన వారూ కష్టాలను అనుభవిస్తుంటారు. అలాంటప్పుడు ఆ పత్రికలు వారికి మద్దతు ఎందుకు ఇవ్వవు ? సమాజంలో ఉన్న అనేక అసమానతలు, సమస్యలు, వివక్ష తదితర సమస్యలపై పత్రికలు అమరావతి ఉద్యమానికి ఇచ్చినంత ప్రాధాన్యత ఎందుకు ఇవ్వవు ? కేవలం నిర్దిష్టమైన వార్తలను మాత్రమే మీడియా ఎందుకు ఫోకస్ చేసి చూపిస్తుంది ? అంటే.. అందులో సామాజిక వర్గాలకు చెందిన ప్రయోజనాలు కచ్చితంగా ఉన్నట్లేగా. కానీ ప్రజలు పత్రికల కన్నా తెలివైన వాళ్లు. వారు ఈ మభ్య పెట్టడాన్ని గమనిస్తూనే ఉంటారు. అందువల్ల అలాంటి వార్తలను పత్రికలు ప్రచురించి ఎంతో కాలం వారిని మభ్య పెట్టలేవు. డబ్బు పెట్టి పత్రికలను కొనుగోలు చేసే పాఠకులకు సామాజిక ప్రయోజనాలను ప్రతిబింబించే వార్తలను అందివ్వకుండా కేవలం తమ వర్గానికి చెందిన వార్తలను ప్రచురించి ఇస్తే.. అది ఎంత వరకు న్యాయం అవుతుంది అనే విషయాన్ని ఆయా మీడియా సంస్థలే ఆత్మ పరిశీలన, సద్విమర్శ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే వాటికి మనుగడ ఉంటుందనే విషయాన్ని ఆయా సంస్థలు గుర్తుంచుకోవాలి.