ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ప్రైవేటు డబుల్ డెక్కర్ బస్సులు ఒకదాన్కొకటి ఢీకొట్టడంతో 8 మంది మృతి చెందగా, మరో 16 మంది ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బారాబంకీ లో పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే పై జరిగింది. బీహార్ నుండి ఢిల్లీ వైపు వెళుతున్న డబుల్ డెక్కర్ బస్సు డ్రైవర్ షడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుండి వేగంగా వస్తున్న రెండో బస్సు బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
రోడ్డు ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అనంతరం లక్నో ట్రామా కేర్ సెంటర్ కు తరలించారు. ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.