వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం పాలైయ్యారు. ఈ ఉదయం చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కర్ణాటకకు చెందిన పోలీసులు మృతి చెందగా, కర్ణాటక రాష్ట్రం కుకనూరు తాలూకా పరిధిలో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు దుర్మరణం పాలైయ్యారు. వివరాల్లోకి వెళితే..
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పి కొత్తకోట వద్ద రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఇన్నోవా కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటక శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ అవినాష్ తో పాటు మరో నలుగురు కానిస్టేబుళ్లు .. డ్రగ్స్ విక్రయించే ఓ వ్యాపారి చిత్తూరులో ఉన్నాడన్న సమచారంతో అతన్ని పట్టుకునేందుకు వెళ్తుండగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్ఐతో పాటు ఒక కానిస్టేబుల్, డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడగా వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కర్ణాటక రాష్ట్రం కుకనూర్ తాలూకా భానుపుర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అయుదుగురు మరణించారు. బిన్వాల్ గ్రామానికి చెందిన దేవప్ప కొప్పడ్ (62) తన కుటుంబంతో కలిసి కారులో తమ బంధువుల ఇంట్లో పుట్టిన రోజు వేడుకలకు హజరై శనివారం స్వగ్రామానికి తిరిగి వెళుతుండగా, భానుపూర్ వద్ద కారు.. ట్రక్కు ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొప్పడ్ కుటుంబంలోని అయిదుగురు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.