అమరావతి: యాత్ర సినిమాను నిరభ్యంతరంగా టివి ఛానళ్లలో ప్రసారం చేయొచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జికే ద్వివేది స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం టిడిపి ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యకు ఎన్నికల సంఘం లేఖ పంపింది.
యాత్ర సినిమాను ఏప్రిల్ 7న బుల్లి తెరపై ప్రసారం చేయనున్నట్టు ‘స్టార్ మా’ ఛానల్ యాజమాన్యం తెలిపింది. అయితే సరిగ్గా ఎన్నికలకు నాలుగు రోజుల ముందు వైఎస్ పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమాను టివిల్లో ప్రసారం చేయడంపై టిడిపి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చిత్రం ద్వారా ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశముందనీ, పోలింగ్ ముగిసేవరకూ చిత్రాన్ని ప్రదర్శించకుండా ఆదేశాలు ఇవ్వాలనీ ఎన్నికల సంఘాన్ని కోరారు. వర్లరామయ్య నేతృత్వంలో పలువురు నేతలు శుక్రవారం ద్వివేదిని కలిసి ఫిర్యాదు చేశారు.
టిడిపి నేతల ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల సంఘం స్టార్ మా ఛానల్లో యాత్ర సినిమా ప్రసారాన్ని నిలిపివేసేందుకు నిరాకరించింది. యాత్ర సినిమా ఎన్నికల నియమావళిని ఏ రకంగానూ ఉల్లంఘించడం లేదని స్పష్టం చేసింది. టిడిపి నేతల ఫిర్యాదును తమ మీడియా సర్టిఫికేషన్ కమిటీ పరిశీలించిందనీ, అందులో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే అంశాలేవీ లేవని తేల్చిచెప్పింది.