న్యూఢిల్లీ: నేతలు ఇష్టం వచ్చినట్లు విద్వేషపూరిత ప్రచారం చేస్తుంటే కిమ్మమనకుండా కూర్చున్న కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టు బోనులో నిలబడాల్సివచ్చింది. ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేసే విషయంలో అధికారుల సేవలను వినియోగించుకోవడంలో ఎన్నికల సంఘం విఫలమవుతున్నట్లు కనిపిస్తోందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఒక దశలో, ‘మీ అధికారాలు ఏంటో మీకు తెలుసా? ఒక వేళ సరైన సమాధానాలు ఇవ్వకపోతే కోర్టుకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను పిలవాల్సి వస్తుంది’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.
ఎన్నికల ప్రచారంలో కుల, మతాలను వినియోగిస్తూ ఓట్లు అభ్యర్ధిస్తున్న రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సోమవారం రంజన్ గోగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
నేతలు ఎన్నికల నియమావళిని ఉల్లంగిస్తుంటే మీరు ఏం చేస్తున్నారని ఎన్నికల సంఘాన్ని రంజన్ గోగోయ్ ప్రశ్నించారు. నోటీసులు పంపించి వివరణ కోరామని ఎన్నికల సంఘం తెలిపింది. అయితే ఎన్ని నోటీసులు పంపారు, ఎవరికి పంపారు అని రంజన్ గోగోయ్ నిలదీశారు.
ఈ సందర్భంగా రంజన్ గోగోయ్ యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించగా.. ఈ కేసు క్లోజ్ అయ్యిందని తెలిపింది.
దీనిపై సమగ్ర విచారణ చేస్తామని, రేపు ఉదయం మళ్ళీ కేసు విచారిస్తామని పేర్కొంది. విచారణకు ఎన్నికల సంఘం ప్రతినిధి హాజరు కావాలని, కుల, మతపర విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసేవారిపై నిబంధనల ప్రకారం ఎలాంటి శిక్షలు ఉంటాయో పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఘజియాబాద్లో ఎన్నికల ప్రచారంలో యోగి ఆదిత్యానాథ్ మాట్లాడుతూ ‘కాంగ్రెస్ నేతలు తీవ్రవాదులకు బిర్యానీలతో సేవలందించారు, కానీ మోది సైన్యం వారికి బులెట్లు, బాంబులు మాత్రమే ఇచ్చింది’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రతి పక్షాలు, మాజీ సైన్యాధికారులు అభ్యంతరం తెలిపారు. కేంద్ర మంత్రి వికె సింగ్ కూడా యోగి వ్యాఖ్యలను తప్పు పట్టారు. సైన్యం ఒక వ్యక్తికి చెందినది కాదు. దేశం మొత్తానికి చెందినదని తెలిపారు.
ఐదు రోజుల తరువాత ఎన్నికల సంఘం దీనిపై స్పందించింది. ఆయనకు నోటీసులు పంపింది. అలాగే దేవ్బంద్లో ఎన్నికల ప్రచారంలో బిఎస్పి అధినేత్రి మాయావతి ముస్లింలను ‘ఓట్లు చీల్చవద్దు’ అని కోరినందుకు ఎన్నికల కమిషన్ ఆమెను హెచ్చరించింది.