Punjab Congress: అసెంబ్లీ ఎన్నికలు ముంగిట ఉన్న పంజాబ్ లో అధికార కాంగ్రెస్ పార్టీ ని మాజీ క్రికెటర్ ,ఆ రాష్ట్రంలో సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరైన నవ్జ్యోత్ సింగ్ సిద్ధు ఆగమాగం చేస్తున్నారు.స్వతహాగానే సిద్దూ వివాదాస్పదుడు.గతంలో ఒక హత్య కేసులో జైలు శిక్ష కూడా పడిన వాడు.క్రీడా రంగం నుండి బిజెపి ద్వారా రాజకీయ ఆరంగ్రేటం చేసిన సిద్దూ ఆ పార్టీనే లెక్కచేయలేదు.
చిన్నపాటి విభేదాలతో రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా తృణప్రాయంగా వదిలేసి కాంగ్రెస్ లో చేరి మంత్రి స్థాయి వరకు ఎదిగిన సిద్ధూకి పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తోనే ప్రాబ్లమంతా!వీరిద్దరి మధ్య గొడవలు సిద్ధూ మంత్రిపదవి వదులుకునేంత వరకూ వెళ్లాయి.అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి.అవకాశం దొరికినప్పుడల్లా సీఎం ఏదో ఒక విధంగా సిద్ధూని బద్నాం చేసే ప్రయత్నాల్లోనే ఉన్నారు. తాజాగా సిద్దూ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరబోతున్నటు ప్రచారం ఉధృతమైంది. దీని వెనుక సీఎం హస్తం ఉందంటారు.తన ఆంతరంగికులతో సీఎం ఈ మేరకు వ్యాఖ్యలు చేసినట్లు కూడా మీడియాలో కథనాలు వచ్చాయి.దీంతో సిద్ధూ సీరియస్ అయ్యారు.
Punjab Congress: నిరూపించమంటూ సిద్ధూ సవాల్!
ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అంటే సిద్ధూకి అరికాలి మంట నెత్తికెక్కుతోంది.అలాగని సిద్ధూ ఏమాత్రం తగ్గడం లేదు.సీఎంతో ఢీ అంటే ఢీ అనే స్థాయిలో సిద్దూ ముందుకు సాగుతున్నారు .ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో తాను చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం పై కూడా సిద్ధూ అంతే సీరియస్గా స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడబోతున్నట్లు,ఆమ్ ఆద్మీ పార్టీలో చేరబోతున్నట్లు కొందరు ఉద్దేశపూర్వకంగా విషప్రచారం సాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.ఆ ప్రచారం చేస్తున్నవారు తాను ఏ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకునితో సమావేశం అయ్యానో, మంతనాలు జరిపానో చెప్పాలని కూడా సిద్దూ తన ట్విట్టర్లో డిమాండ్ చేశారు.పదవులను ఆశించే నైజం తనది కాదని, గతంలో ఎంపీ పదవిని, మంత్రి పోస్టును కూడా వదిలేసుకున్న చరిత్ర తనదని సిద్దూ చెప్పారు .ఇప్పటికీ తనకు మంత్రి పదవి ఆఫర్ ఉందని అయినా తాను ప్రలోభాలకు గురి కావడం లేదన్నారు. పంజాబ్ అభివృద్ధే తన ధ్యేయమన్నారు.
సీఎంకు పరోక్ష హెచ్చరిక!
పనిలో పనిగా సిద్ధూ పంజాబ్ ముఖ్యమంత్రికి షాక్ ఇచ్చే ఒక అంశాన్ని తన ట్వీట్లో వెల్లడించారు.కాంగ్రెస్ అధిష్టానవర్గం పంజాబ్ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తోందని ,ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చునని వేచి చూడండని సిద్ధూ అందులో పేర్కొన్నారు.అంటే సీఎం పదవికే ఎసరు వచ్చే అవకాశముందని సిద్ధూ ఈ విధంగా పరోక్షంగా ముఖ్యమంత్రిని హెచ్చరించినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.పంజాబ్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ కి కూడా తలనొప్పిగా మారాయని వారు చెప్తున్నారు.