రెండు వారాలు… ఏలూరు ఊపిరి బిగపట్టుకొని ఉన్న సమయం. వింత వ్యాధి ఏలూరును షాక్కు గురి చేసింది.తాజాగా దీనికి సంబంధించి కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. ఎయిమ్స్ నివేదికలో సంచలన విషయాలు బయటపడ్డాయి. పురుగుమందుల అవశేషాలే ఏలూరు పరిస్థితికి కారణమని ఎయిమ్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సహా ప్రఖ్యాత సంస్థల అభిప్రాయపడ్డాయి. అయితే, అసలు సమస్య ముందుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఏలూరు లో ఎందుకు అంతు చిక్కని సమస్య?
ఏలూరులో వింత వ్యాధికి కారణం ఏంటన్నది అంతుచిక్కక పోవడంతో ప్రజల్లో ఆందోళన రేగింది. ఊహాగానాలు మరింత కలవరం రేకెత్తించాయి. బియ్యంలో పాదరసం ఉందని NIN పరిశోధనలో తేలింది. మరోవైపు కూరగాయల్లో పురుగుల మందు అవశేషాలు ఉన్నాయని CCMB కూడా తుది నివేదికలో వెల్లడించింది. వింత వ్యాధికి గాలి, నీరు కారణం కాదని తేల్చి ఎయిమ్స్, ఏపీ పీసీబీలు స్పష్టం చేశాయి. వింత వ్యాధి బారిన పడిన బాధితుల శరీరాల్లో లెడ్, నికెల్, ఆర్గానో క్లోరిన్ ఎలా వెళ్లాయన్నదానిపై ఇంకా పరిశోదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో పరిశోధనలపై ఎయిమ్స్ తుది నివేదిక సమర్పించింది. పురుగుమందుల అవశేషాలే ఏలూరు పరిస్థితికి కారణమని తేల్చింది. అవి ఎలా మనుషుల శరీరాల్లోకి ప్రవేశించాయన్నదానిపై దీర్ఘకాలంలో మరింత అధ్యయనం అవసరమని నిపుణులు పేర్కొన్నారు.
సీఎం జగన్ కీలక నిర్ణయం
ఏలూరు తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆర్బీకేల ద్వారా సేంద్రీయ పద్ధతులు, వ్యవసాయానికి పెద్దపీట వేయాలని సీఎం ఆదేశించారు. ఏలూరు వింత వ్యాధి సమస్యను లోతుగా అధ్యయనం చేసేందుకు న్యూఢిల్లీ, ఎయిమ్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి బాధ్యతలు సీఎం జగన్ అప్పగించారు. క్రమం తప్పకుండా పరీక్షలు చేయాలన్న ముఖ్యమంత్రి, ప్రతిజిల్లాలో కూడా ల్యాబులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. క్రమం తప్పకుండా ఆహారం, తాగునీరు, మట్టి నమూనాలపై పరీక్షలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఫలితాలు ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం దీనిపై కార్యాచరణ రూపొందించాలని సీఎస్కు ఆదేశాలు జారీ చేశారు.