పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో అంతు చిక్కని వ్యాధి గ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. విపరీతంగా పెరుగుతున్న బాధితులతో ఏలూరు జిల్లా ఆసుపత్రి పడకలు నిండిపోయాయి. దీంతో ఆసుపత్రికి వస్తున్న బాధితుల లక్షణాలను పరిశీలించి కొందరిని సమీపంలో గల ఆశ్రం వైద్య కళాశాలకు తరలిస్తున్నారు. గత రెండు మూడు రోజులుగా చికిత్స పొందుతున్న వారిలో కొందరు కోలుకుని డిశ్చార్జ్ అయి ఇళ్లకు వెళుతుండగా మరో పక్క కొత్త కేసులు బారులు తీరుతున్నాయి. నేటి వరకూ అంతు చిక్కని వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య 500కు దాటింది. గడచిన మూడు రోజుల్లో 332మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. మరో 153మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం 19మందిని విజయవాడ, గుంటూరు ఆసుపత్రులకు తరలించారు.
వైద్య పరీక్షలపై సీఎం వైఎస్ జగన్ ఆరా
ఓ పక్క బాధితుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తున్నది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆసుపత్రుల్లో ఆస్వస్థతకు గురైన వారికి నిర్వహిస్తున్న పరీక్షలపై ఆరా తీశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వైద్య బృందాలు నిర్వహించిన పరీక్షల వివరాలను సీఎంఓ అధికారులు సీఎం జగన్కు వివరించారు. అస్వస్థతకు గురైన వారికి ఎయిమ్స్ వైద్య నిపుణుల బృందం నిర్వహించిన పరీక్షల్లో సీసం, నికెన్ లాంటి మూలకాలు ఉన్నట్లుగా తెలుస్తోందనీ, ఇంకా మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. అదే విధంగా ఐఐసీటీ కూడా పరీక్షలు జరుపుతోందనీ, వాటి వివరాలు కూడా త్వరలోనే వస్తాయని వెల్లడించారు. బాధితులకు నిర్వహించిన పరీక్షల వివరాలు, ఆ ప్రాంతంలో నీళ్లు, పాలకు నిర్వహించిన పరీక్షల వివరాలను నివేదిక రూపంలో అందజేయాలని జగన్ ఆదేశించారు. దీనిపై సమీక్ష జరిపేందుకు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలనిన అధికారులను సీఎం ఆదేశించారు. ప్రాధమిక పరిశోధనలో వెల్లడైన అంశాల ప్రకారం సీసం లాంటి మూలకాలు ఆ ప్రాంత ప్రజల శరీరంలోకి ఎలా వెళ్లాయి. దానికి కారణాలు పూర్తి స్థాయిలో పరిశీలన జరపాలని వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారు.