Eluru Municipal Corporation Counting: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగర పాలక సంస్థ ఎన్నికల కౌంటింగ్ కు అడ్డంకులు తొలగిపోయాయి. కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహణకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కౌంటింగ్ కేంద్రంలో కోవిడ్ -19 నిబంధనలు పాటించాలని హైకోర్టు సూచించింది. గురువారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) తేదీని ప్రకటించింది. ఈ నెల 25న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ నిబంధనల మేరకు లెక్కింపు ప్రక్రియ చేపట్టాలని అధికార యంత్రాంగానికి ఎస్ఈసీ ఆదేశించింది.
ఏలుర నగర పాలక సంస్థకు మార్చి 10వ తేదీన పోలింగ్ జరిగింది. ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లాయంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ఓట్ల లెక్కింపు నిలిపివేయాలంటూ హైకోర్టు మథ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం విచారణ చేపట్టిన హైకోర్టు..ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం నేడు కౌంటింగ్ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు వెల్లడించింది. దీంతో ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది.