Employees: ఈ ఏడాదికి సంబంధించిన బడ్జెట్ 2022లో వేతన జీవులకు భారీ ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందా? అని అడిగితే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులకు మెరుగైన పన్ను ప్రయోజనాలు అందించాల్సిందిగా చాలా రోజులనుంచి ప్రముఖ ఇండస్ట్రీలు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు అర్జీలు పెడుతున్నాయి. కరోనా సమయంలో చాలామంది ఇళ్ల నుంచే వర్క్ చేశారు. దీనివల్ల ఇంటర్నెట్, టెలిఫోన్, ఫర్నిచర్ వంటి చాలా బిల్లులకు ఖర్చు చేయాల్సి వచ్చింది. మెడికల్ ఖర్చులు కూడా పెరిగిపోయాయి. కానీ ఉద్యోగులు వీటిపై పన్ను మినహాయింపు ఎక్కువగా పొందలేక మరింత ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం.. స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్పై కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది.
Employees: స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్
జీతం సంపాదించే ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్ను కేంద్ర ప్రభుత్వం ఈసారి పెంచేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలియజేస్తున్నాయి. స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్ అనేది రూ.50 వేలుగా కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీనివల్ల రూ.50 వేల కంటే ఎక్కువగా పన్ను డిడక్షన్ ప్రయోజనాలు పొందలేకపోతున్నారు ఉద్యోగులు. ఎప్పటినుంచో ఈ పరిమితిని పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ఈసారి కరోనాను దృష్టిలో పెట్టుకొని స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్ను 30-35 శాతానికి పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు కూడా తమకు కేంద్ర ప్రభుత్వం టాక్స్ బెనిఫిట్స్ అందిస్తుందని ఆశిస్తున్నారు. కేంద్రం దీనికి సంబంధించి బడ్జెట్ 2022-23లో ఓ ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది. ఒకవేళ ఉద్యోగులు కొత్త పన్ను విధానాన్ని సెలెక్ట్ చేసుకుని ఉంటే.. వారికి స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాలు లభించవని గుర్తించాలి. పాత పన్ను విధానంలో మాత్రమే ఈ బెనిఫిట్స్ పొందడం సాధ్యమవుతుంది.
చాలాకాలంగా ఎదురుచూపులు
గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా హోదాలో కొనసాగిన దివంగత అరుణ్ జైట్లీ 2018వ ఏడాదిలో స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్ను తీసుకొచ్చారు. ఆ సమయంలో ఈ లిమిట్ను రూ.40 వేలుగా నిర్ణయించగా.. దీన్ని 2019వ సంవత్సరంలో పీయూష్ గోయల్ 50 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆ సమయం నుంచి ఈ లిమిట్ పెరగలేదు. ఈ పరిమితిని పెంచుతారేమేనని ఉద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే కరోనా కారణంగానైనా వేతన జీవులపై పన్ను భారం తగ్గించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందో లేదో చూడాలి.