Pawan kalyan ఆవిర్భావ సభలో చెప్పిన మాట ఒకటి గుర్తుందా?? కాపు నాయకులు తనకు మద్దతు ఇవ్వము అని చెబుతున్నారట! నేను అడిగానా వాళ్ళని?? బాబు బాబు నాకు నా పార్టీకి మద్దతు ఇవ్వండి అని… ఆ సమయంలోనే ఆ మాట పెను సంచలనం అయ్యింది. కాపుల మద్దతు లేకుండా పవన్ కళ్యాణ్ ఎలా ముందుకు వెళ్తారు? వారి మద్దతు అవసరం లేకుండానే ఎలా రాజకీయాలు చేస్తారు అంటూ అప్పట్లోనే పెను దుమరం రేగింది. దాని తర్వాత కాపులను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దగ్గరికి తీసింది లేదు.. కాపు ఉద్యమంలో ఆయన పాత్ర పోషించింది లేదు. 2019 ఎన్నికల్లో స్వతహాగా ఆయన నేను రెల్లి కులస్థుడిని… అని ప్రకటించుకున్న అప్పుడు సైతం కాపు నాయకుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఒక కాపు గా పుట్టి రెడ్డి కులస్తులు గా ఎలా చెప్పుకుంటారని.. కావలసిన వాళ్ళకి ఆయన దూరం పెడుతున్నారని ఆయనను పలువురు పలు మాటలు అన్న దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. 2014లో పార్టీ ప్రకటించిన దగ్గర నుంచి రెండు ఎన్నికలను ఎదుర్కొన్న జనసేన పార్టీ కాపులను ప్రత్యక్షంగా మద్దతు కోరకుండానే ఎన్నికలకు వెళ్లింది. ఆ ఫలితాలు అత్యంత చేదుగా ఉండటంతోపాటు పార్టీ నానాటికీ దారుణంగా తయారు అవుతున్న డంతో ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గమైన కాపులు వైపు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కాపు ఉద్యమాన్ని ఆయన తనదైన పంథాలో ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమాన్ని పక్కన పెట్టినట్లు ఇటీవల ప్రకటించడంతో ఆ ఖాళీని పవన్ కళ్యాణ్ భర్తీ చేసే విధంగా అడుగులు పడుతున్నాయి. త్వరలోనే కాపు సంక్షేమ నాయకులతో బేటీ అవుతున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పడం ఇటు రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.
BJP గాలం… జనసేన తాళం! Pawan kalyan
BJP ఇప్పటికే కాపులను తమ వైపు తిప్పుకునేందుకు నానా రకాల ప్రయత్నాలను ఢిల్లీ స్థాయిలో ప్రారంభించింది. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ను ప్రత్యేకంగా కలిసి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముద్రగడ ముందు పెద్ద విషయం ఉంచామని, దానిని ఆయన నెరవేరుస్తారా నమ్మకం తమకు ఉందని చెప్పుకొచ్చారు. దీంతో పాటు ఢిల్లీ స్థాయిలో బిజెపి నాయకుల ప్రోద్బలంతోనే తాను ముద్రగడ ను కలిసినట్లు కూడా చెప్పడం విశేషం. బిజెపి ఈ కొత్త మార్గం ద్వారా కాపులను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తూ ముందుకు సాగుతుంటే, ఆ పార్టీలో బలమైన క్రౌడ్ పుల్లర్ ఎవరూ లేకపోవడం బీజేపీకి పెద్ద మైనస్. బలంగా మాట్లాడి నాయకులు నిలబడే నాయకులు బీజేపీ కు తక్కువగా ఉండడం, కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే స్థాయి వ్యక్తులు కొదవ ఉండడం బి.జె.పి ముందుకు వెళ్లలేక పోవడానికి ప్రధాన కారణం. కాపులకు బీజేపీ దగ్గర అవడంతో పాటు.. రాష్ట్రంలో అత్యధికంగా దళితులు తర్వాత జనాభా ఉన్నా కాపుల ఓట్లు కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో సంఘటితం చేస్తేనే వైఎస్సార్సీపీ నిలువరించడం సాధ్యం అనే అంచనాకు ఇప్పటికే బిజెపి వచ్చింది. కాపుల ఓట్లన్నీ గంపగుత్తగా బిజెపి జనసేన కూటమికి పడితేనే వైఎస్ఆర్సిపి కు ప్రధానంగా పోటీ ఇవ్వగలమని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. దీంతోనే ఇప్పటికే కాపులకు గాలం వేసే పనిలో బిజెపి నాయకులు ఉంటే ఇప్పుడు జనసేనని పవన్కళ్యాణ్ సైతం కాపులను ఆకట్టుకునేందుకు వారితో సమావేశం అవ్వడం, మొదటిసారి వారి డిమాండ్లు వినేందుకు జనసేనాని సిద్ధపడడం కాపులను దగ్గరికి చేరుకోవడంలో భాగమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కాపులు నమ్ముతారా?
జనసేన పార్టీ పెట్టిన తర్వాత కాపులను ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కలిసింది లేదు. ఇప్పుడు ఏకంగా కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులతో నే జనసేన అధ్యక్షుడు మాట్లాడి కాపు రిజర్వేషన్ల మీద, రాష్ట్రంలో ఆర్ధికంగా వెనుకబడిన తరగతులకు ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్ల అమలు మీద చర్చిస్తారని తెలుస్తోంది. ఈ సమావేశంలోనే రాజకీయ చర్చ కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన బీజేపీ కూటమి కి కాపులంతా ఐక్యంగా మద్దతిస్తే రిజర్వేషన్లు విషయంలో ప్రత్యేకంగా చర్యలు తీసుకోవచ్చని… ఎవరిని అడగకుండానే తమ రిజర్వేషన్లు న్యాయపరంగా తామే రూపొందించుకోవచ్చు అని పవన్ కళ్యాణ్ సూచించే అవకాశాలు లేకపోలేదు. కాపుల రిజర్వేషన్ మీద జనసేన బిజెపి ఉమ్మడి ఎజెండాను కాపు సంక్షేమ నాయకులకు చెప్పి వారిని ఒప్పించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. రిజర్వేషన్లు ఇతర విషయాల మీద చర్చించి వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తమకు మద్దతు పలికితే… ఎలా పాలన ఉంటుంది అనేదానిమీద పవన్ కళ్యాణ్ కాపు ప్రతినిధులకు స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. మరి అత్యంత త్వరలో కాపు ప్రతినిధులను కలవబోతున్న పవన్ కళ్యాణ్ ఎలాంటి హామీలు వారి నుంచి పొందుతారు? భవిష్యత్తులో రాజకీయ వ్యూహం ఎలా ఉండబోతుంది అన్నది కీలకంగా మారింది.