న్యూఢిల్లీ: ఎరిక్సన్-ఆర్కామ్ కేసులో రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్కాం) ఛైర్మన్ అనిల్ అంబానీకి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. అనిల్ అంబానీని కోర్టు దోషిగా తేల్చింది. అంతేగాక, ఎరిక్సన్కు నాలుగు వారాల్లోపు రూ.453కోట్లు చెల్లించాలని.. లేకపోతే మూడు నెలలు జైలు శిక్ష తప్పదని స్పష్టం చేసింది.
న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ వినీత్ సహరన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. అనిల్ అంబానీ, రిలయన్స్ టెలికాం ఛైర్మన్ సతీష్ సేత్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ ఛైర్పర్సన్ ఛాయా విరానీలు తలా రూ. కోటి అపరాధ రుసుం చెల్లించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
నెలలోపు ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయకపోతే నెల రోజులపాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. కాగా, అనిల్ అంబానీని వెంటనే అరెస్ట్ చేయాలన్న ఎరిక్సన్ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బుధవారం అడాగ్ గ్రూప్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.
అనిల్ అంబానీ తరపున ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించగా.. ఎరిక్సన్ తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ‘వారి(అనిల్ అంబానీ) వద్ద రఫెల్ కోసం డబ్బులు ఉంటాయి. ప్రతిష్టాత్మకమైన ప్రతి ప్రాజెక్టులో భాగస్వామి కావడానికి వారి వద్ద డబ్బు ఉంటుంది. మాకు(ఎరిక్సన్) చెల్లించడానికి మాత్రం ఉండదు. న్యాయస్థానం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి’ అని దవే తమ వాదనలు వినిపించారు.