ఆంధ్రప్రదేశ్ నూతన బడ్జెట్టు ప్రతిపక్షాలకు ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి అనువుగా దొరికింది.బడ్జెట్ సమర్పణ సమయంలో అవలంబించాల్సిన సంప్రదాయాలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి పాటించ లేదన్నది ప్రతిపక్షాల ప్రధాన విమర్శ.బడ్జెట్ సమర్పణ సమయంలో కూడా గత టిడిపి ప్రభుత్వంపై బురదజల్లడమే ధ్యేయంగా రాజేంద్రనాథ్ ప్రసంగం సాగింది అంటున్నారు
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ని ఆర్ధిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశ పెట్టారు. ఇందులో సంక్షేమం ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్ ని తయారు చేసి ప్రవేశ పెట్టారు అని అర్ధం అవుతుంది. కేవలం సంక్షేమానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ ని రూపొందించారు. నవరత్నాలను అమలు చేయడమే లక్ష్యంగా… అదే విధంగా పాదయాత్ర సమయంలో, అలాగే ఎన్నికల హామీల్లో ఇచ్చిన విధంగా పథకాల్ని అమలు చేయడానికి గానూ బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించారు. ఇక ఇందులో విద్య, వైద్య, వ్యవసాయ శాఖలకు భారీగా కోత కూడా విధించారు. అక్కడి వరకు బాగానే ఉంది గాని బడ్జెట్ సమర్పణ విధానంలో కొన్ని కొన్ని అంశాలను కచ్చితంగా ప్రస్తావించాల్సి ఉంటుంది.
బడ్జెట్ ని ప్రవేశ పెట్టే సమయంలో సాధారణంగా చాలా వరకు… గత ఏడాది ఖర్చులు, ఆదాయం అన్నీ కూడా ప్రస్తావిస్తారు. మూలధన వ్యయం గురించి శాసనసభలో సభ్యులకి వివరిస్తారు. అలాగే ఏయే శాఖకు ఎంత ఖర్చు చేసాం అనేది చెప్పటం కూడా ఆనవాయితీ. సామాజిక వర్గాల వారీగా లెక్కలు కూడా ఉంటాయి. కానీ ఈసారి బడ్జెట్ లో అలా జరగలేదు. లెక్కలు చదువుతూ టీడీపీ చేసిన అప్పులను ప్రస్తావిస్తూ వచ్చారు. ఇక సామాజిక వర్గాలకు చేసిన ఖర్చులను చెప్పలేదు. సామాజికవర్గాల్లో ఏయే సామాజికవర్గానికి ఎంత ఖర్చు చేసాం అనేది రూపాయి కూడా లెక్క చెప్పలేదు. ఇక సామాజిక వర్గాలకు కేటాయించిన నిధులను ఎక్కువగా అమ్మ ఒడి, అదే విధంగా గోరు ముద్ద వంటి సంక్షేమ పథకాలకు ఖర్చు చేశారు…తప్ప నేరుగా ఆయా వెనుకబడిన వర్గాలకి ఖర్చు చేయలేదు అన్నది విస్పష్టం. వివిధ వర్గాలకి కేటాయించిన నిధుల్ని విద్యా దీవెన, వసతి దీవేన వంటి సంక్షేమ పధకాలకు ఎక్కువ ఖర్చు చేశారు. ఉదాహరణకి కాపులకు ఈ బడ్జెట్ లో 2300 కోట్లు కేటాయింపులు చేశారు. గత సంవత్సరం 2000 కోట్లు కేటాయించారు. అంటే గత ఏడాది కంటే ఎక్కువే. కానీ కాపు నేస్తంకి ఖర్చు చేసింది కేవలం 350 కోట్లు. మరి మిగిలిన లెక్క చెప్పలేదు, బీసీ, ఎస్సీ ఎస్టీ విషయంలో కూడా ఇదే జరిగింది. ఇక ఈ బడ్జెట్ లో బ్రాహ్మణా కార్పొరేషన్ కి, ఆర్య వైశ్య కార్పొరేషన్ కి, ఎస్సీ, ఎస్టీ, మైరారిటీల ఆర్ధిక అభివృద్ధికి ఉపకరించే విధంగా వారి వృత్తి పరంగా సహాయపడేందుకు యూనిట్లు అందించటానికి కేటాయింపులు అస్సలు లేవు. ఉద్యోగులకి హామీ ఇచ్చిన సిపిఎస్ రద్దు పై అసలు ప్రస్తావనే లేకపోవటం వారిని తీవ్ర నిరాశలో ముంచింది.బడ్జెట్ సమర్పణలో కూడా వైసీపీ ప్రభుత్వం తనదైన మార్కు చూపిందని భావించాల్సి ఉంటుంది .దీనిపై టిడిపి మిగిలిన ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?