Etela Rajender: ఈటెల రాజేందర్ Etela Rajender: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. భూకబ్జా ఆరోపణలపై ఏకంగా సీఎం కేసీఆర్ స్వయంగా విజిలెన్స్ విచారణకు ఆదేశించడం తీవ్ర సంచలనం రేపింది. దీనికి ముందు చూస్తే.. కొన్నాళ్లుగా సీఎం కేసీఆర్, మంత్రి ఈటెల మధ్య సత్సంబంధాలు లేవు. ఏదొక సందర్భంలో ఈటెల చేస్తున్న వ్యాఖ్యలు ఇందుకు ఊతమిచ్చేవి. కొన్నేళ్ల క్రితం వరంగల్ జిల్లాకు చెందిన తాటికొండ రాజయ్యను కూడా కేసీఆర్ ఇదే విధంగా టార్గెట్ చేసి మంత్రి పదవి నుంచి దిగేలా చేశారు. మళ్లీ ఇన్నేళ్లకు మరో మంత్రిపై కేసీఆర్ కన్నెర్ర చేయడం ఇదే.
తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచీ కేసీఆర్ వెన్నంటే ఉన్నారు ఈటెల. ఆర్ధిక బలం మెండుగా ఉన్న రాజేందర్ ఉద్యమాన్ని నడిపించారు.. ఉద్యమకారులను కాచుకున్నారు.. తెలంగాణవాదాన్ని అసెంబ్లీలో బలంగా వినిపించారు. అటువంటి ఈటెలపై కేసీఆర్ గట్టి నమ్మకం పెట్టుకుని రాష్ట్రావిర్భావం నుంచి క్యాబెనెట్ లో పెద్ద పీటే వేశారు. కానీ.. ఇప్పుడు వీరి మధ్య బంధం చెడిపోయింది. అయితే.. ఈ ఎపిసోడ్ లో ఎవరికి లాభం అంటే ఈటెల వైపే ఉంటుందని చెప్పాలి. పక్కా ప్లానింగ్ తోనే తనపై చర్యలకు దిగారని కేసీఆర్ గురించి తెలిసిన ఈటెల అంటున్నారు. కేసీఆర్ కూడా.. ఈటెలపై ఒక్కసారిగా చర్యలు తీసుకుంటే పార్టీపై, ప్రభుత్వంపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని భావించే భూకబ్జా ఆరోపణలు చూపించారని చెప్పాలి.
ఈటెల రాజీనామా చేస్తారనే అందరూ భావించారు. కానీ.. ఈటెల ఈ సందర్భాన్ని ధీటుగా ఎదుర్కొన్నారు. తనకు తానుగా రాజీనామా చేయకుండా సీఎం ఆదేశాలు ఇస్తేనో.. స్వయంగా మాట్లాడితేనో చూద్దామనే ధోరణి కనబరిచారు. అదే జరిగితేమొత్తంగా ఈ వ్యవహారంలో కేసీఆర్ తీరు తెలిసిన వారు ఈటెలపై సానుభూతి చూపించే అవకాశమే ఎక్కువ. ఉద్యమ సమయంలో ఈటెల పాత్రను ఎవరూ అంత త్వరగా మరచిపోరు. దీంతో ప్రతిపక్షాలకు కేసీఆర్ టార్గెట్ అయినట్టే. ఇప్పటికే విజయశాంతి కేసీఆర్ ను దూనమాడి.. ఈటెల వైపు సానుభూతి ప్రకటించారు. ఆమధ్య మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా ఈటెలను కలిసేందుకు సిద్ధమని ప్రకటించారు. మరి.. రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయో చూడాలి.