Etela Rajender : ఈటెల రాజేందర్ Etela Rajender: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కారణమైన వ్యక్తుల్లో ఈటెల రాజేందర్ ఒకరు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ముందుండి నడిపిస్తే.. ఆయన వెనుకే అడుగులు వేస్తూ పార్టీ జెండా మోసిన వ్యక్తుల్లో ఈటెల ప్రముఖ వ్యక్తి.
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ సీఎంగా ఉన్న సందర్భంలో అసెంబ్లీలో తెలంగాణ వాణిని బలంగా వినిపించారు. ఆయన్ను పేరు పెట్టి వైఎస్ పిలిచేంతగా ఈటెల గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో కేసీఆర్ కు అత్యంత ముఖ్యుల్లో ఈటెల రాజేందర్ కూడా ఒకరిగా నిలిచారు. అయితే.. ఇటివలి కాలంలో ఈ బంధానికి బీటలు వారినట్టే అనిపిస్తోంది. కొన్నాళ్లుగా ఈటెల వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.
సొంత జిల్లా ఉమ్మడి కరీంనగర్ లో మంత్రి ఈటెల రాజేందర్ నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ‘కల్యాణ లక్ష్మి, పింఛన్లు పేదరికాన్ని దూరం చేయలేవు. కులం, డబ్బు, పార్టీ జెండాను కాదు.. మనిషిని గుర్తు పెట్టుకోవాలి. ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు.. కాని శాశ్వతంగా కాదు. పెట్టింది చెప్పొద్దు.. చేసిందీ చెప్పుకోవద్దు. నేను ఇబ్బంది పడుతూ ఉండొచ్చు.. గాయపడుతూ ఉండొచ్చు.. కానీ నా మనసు మారలేదు. పెట్టే చేయి ఆగదు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో నన్ను గొప్పగా తీసుకెళ్లిన వారిని నేను మరువను. అందరి రుణం తీర్చుకునే వ్యక్తిని నేను. పరిగ ఏరిన వాడు చేను పండించినట్టు కాదు’ అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపాయి.
కొన్నాళ్లుగా సీఎం కేసీఆర్ కు మంత్రి ఈటెల రాజేందర్ కు మధ్య దూరం పెరిగిందనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యమైన మంత్రివర్గ సమావేశాలకు కూడా ఆయనకు ఆహ్వానం అందడం లేదని తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరిలో కేసీఆర్ నిర్వహించిన మంత్రివర్గ సదస్సుకూ ఆయనకు ఆహ్వానం అందలేదు. కొన్నాళ్లుగా ఈటెల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఆమధ్య.. ‘పార్టీ పెట్టడం అంటే టీ కొట్టు పెట్టడం కాదు’ అని కేసీఆర్ అన్నారు. ఈటెలను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలనే కామెంట్స్ వచ్చాయి. అయితే.. ఏదీ ఎక్కడా బహిర్గతం కాలేదు. కానీ.. ఈటెల అప్పుడప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు అనేక ఊహాగానాలకు ఊతమిస్తోంది. మరి ఈ గుట్టు వీడేదెన్నడో..!