Etela Rajendra: తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ను కేబినెట్ నుంచి తప్పించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గులాబీ బాస్ తన మంత్రివర్గ సహచరుడు ఈటల రాజేందర్ పై గుస్సాగా ఉన్నట్లు చాలా కాలంగా మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి.
ఒక సందర్భంలో ప్రగతి భవన్లో జరిగిన అతి ముఖ్య సమావేశానికి ఆ పక్కనే ఉన్న ఈటలను పిలవకుండానే ముఖ్యమంత్రి ముగించేశారు.ఆ తర్వాత ఈటల కొద్దిగా మాటల తూటాలు విసరడంతో కెసిఆర్ కొద్దిగా వెనక్కు తగ్గి ఈటల ను మళ్లీ చేరదీసిన బిల్డప్ ఇచ్చారు.తన కారులో ఎక్కించుకొని మరీ ఇంటికి తీసుకెళ్లి విందు ఇచ్చారు.దీంతో వారిద్దరూ మళ్లీ ఒక్కటయ్యారని అందరూ అనుకున్నారు కానీ కేసీఆర్ తన పథక రచన లోనే ఉన్నారు .ఈ సందర్భంలోనే ఈటెల జుట్టు కెసిఆర్ కి అందింది
అదెలాగంటే?
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులో సుమారు 100 ఎకరాల భూమి అంశంలో మంత్రి ఈటలపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో అప్పడు కలెక్టర్గా పని చేసిన ధర్మారెడ్డి పూర్తి వివరాలు, మంత్రి ఈటల ప్రమేయాన్ని సీఎం కేసీఆర్కు నివేదించినట్లు విశ్వసనీయ సమాచారం.
దాదాపు నాలుగున్నరేండ్ల కిందట ఈ వ్యవహారం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల ఈ భూమికి ఓ రోడ్డు విషయంలో రైతులతో రాజీ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై కొంతమంది రైతులు వ్యతిరేకించడంతో ఈ వ్యవహారం ఈ మధ్య బయటకు పొక్కింది. దీంతో కేసీఆర్ మళ్లీ కత్తి బయటకు తీశారు .ఈ భూ వ్యవహారంలో ఈటల రాజేందర్పై చర్యలు తీసుకుంటూ మంత్రి వర్గం నుంచి ఉద్వాసన పలికేందుకు సిద్ధం అయిపోయారని టాక్! రేపో, మాపో మంత్రి ఈటలను కేబినెట్ నుంచి తప్పించేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నట్లు కూడా చెప్పుకుంటున్నారు.
Etela Rajendra: టీ న్యూస్ లోనే ఈటలపై ఈటెలు
మరోవైపు మంత్రి ఈటల వ్యవహారం శుక్రవారం సాయంత్రం నుండి మీడియాలో వైరల్గా మారింది. టీఆర్ఎస్ పార్టీ అధికారిక ఛానల్గా గుర్తింపు ఉన్న టీ న్యూస్లో కూడా ‘‘ఆరోగ్య శాఖ మంత్రికి కబ్జారోగం’’ అంటూ ఇదే అంశాన్ని హైలెట్ చేసింది. అటు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే పలు ఛానళ్లలో కూడా ఈ వార్త పదేపదే రావడం సంచలనంగా మారింది.ఇవన్నీ చూస్తుంటే ఈటల పదవీచ్యుతికి ఇంకెంతో సమయం పట్టదని టీఆర్ఎస్ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి.సాగర్ ఉపఎన్నిక ఫలితం రాగానే కెసిఆర్ ఈ పనే మొదట చేస్తారంటున్నారు.