GHMC : గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికకు ఒక్కరోజే టైం ఉండటంతో అంతటా ఉత్కంఠ నెలకొంది.
సీట్లు, ఎక్స్అఫీషియో లెక్కలతో.. పీఠం టీఆర్ఎస్కే దక్కే చాన్స్ ఉండటంతో ఆశావహుల్లో ఎవరికి వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తమకు చాన్స్ ఇవ్వాలని కేసీఆర్, కేటీఆర్లను కలిసి కోరుతున్నారు. పార్టీ సీనియర్నేతలు కొందరు తమ వారసులకు మేయర్చాన్స్ ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. ఉద్యమ సమయం నుంచీ వెంట ఉన్న తమకు అవకాశం ఇవ్వాలంటూ మరికొందరు విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే ఎన్నిక జరిగే గురువారం రోజునే మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లను సీల్డ్ కవర్ లో తెలంగాణ భవన్ కు పంపుతామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఆ రోజు ఉదయం 9 గంటలకల్లా టీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో ఓటర్లుగా ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలంతా తెలంగాణ భవన్కు రావాలని ఆదేశించారు. అక్కడే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పంపించిన సీల్డ్ కవర్ ను ఓపెన్ చేసి మేయర్, డిప్యూటీ మేయర్ క్యాండిడేట్ల పేర్లను ప్రకటించనున్నారు. ఆ సీల్డ్ కవర్లో ఎవరి పేరు ఉంటుందనే దానిపై టెన్షన్ నెలకొంది. జీహెచ్ఎంసీ మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వు అయింది. పదవి కోసం ఓసీలతోపాటు బీసీ మహిళా లీడర్లు కూడా తీవ్రంగా పోటీ పడ్తున్నారు. దీంతో ఓసీలకు చాన్స్ ఇస్తారా, బీసీలకు ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
GHMC : అధినేత ఆశీస్సుల కోసం ఉరుకులు పరుగులు!
మేయర్ పదవిని తమ వారసులకు ఇప్పించుకునేందుకు టీఆర్ఎస్ లీడర్లు చివరి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రగతిభవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్, కేటీఆర్ లను కలిసి తమ వాళ్లకు చాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే వారు ఇప్పటివరకు అందరూ చెప్పింది వినడమే తప్ప.. ఎవరికీ ఎట్లాంటి సంకేతాలు ఇవ్వడం లేదని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఎంపీ కె.కేశవరావు తన బిడ్డ విజయలక్ష్మికి మేయర్ పదవి ఇప్పించేందుకు తీవ్రంగా ట్రై చేస్తున్నట్టు పార్టీ లీడర్లు చెప్తున్నారు. టైం దొరికిన ప్రతిసారీ ఈ విషయాన్ని కేసీఆర్ కు దృష్టికి తెస్తున్నారని అంటున్నారు. ఇక ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ తన భార్య శ్రీదేవికి మేయర్ పదవి ఇవ్వాలని అడుగుతున్నట్టు తెలిసింది. రెండు రోజుల క్రితం రామ్మోహన్, శ్రీదేవి ఇద్దరూ ప్రగతిభవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ ను కలిశారు. మరోవైపు తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలతకు మేయర్ పదవి ఇవ్వాలంటూ ఆమె భర్త శోభన్ రెడ్డి గట్టిగా ట్రై చేస్తున్నారు. ఉద్యమ కాలం నుంచీ పార్టీలో ఉన్న తమకు ఇప్పటిదాకా ఎట్లాంటి అవకాశం రాలేదంటూ ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. ఇక ఇప్పటికే పలుసార్లు కేటీఆర్ ను కలిసి తనకు మేయర్ చాన్స్ ఇవ్వాలని కోరిన పీజేఆర్ బిడ్డ విజయారెడ్డి.. తాజాగా మరోసారి కేటీఆర్ ను కలిసి విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. భారతీనగర్ కార్పొరేటర్ సింధూ ఆదర్శ్రెడ్డికి మేయర్ పదవి ఇవ్వాలని ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి కోరుతున్నట్టు సమాచారం. వెంకటేశ్వర కాలనీ కార్పొరేటర్ మన్నె కవిత, అల్వాల్ కార్పొరేటర్ విజయశాంతి కూడా మేయర్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.అయితే ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందని కాకుంటే కెసిఆర్ గుంభనంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.