ఆంధ్రప్రదేశ్ లో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరు.ప్రెస్ మీట్ లో కూడా ఆయన పరుష పదజాలం వాడతారు.తెలుగుదేశం పార్టీ అయితే ఆయనకు బూతుల మంత్రి అని నామకరణం కూడా చేసింది.
నాని మాదిరిగానే తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన ఒక వ్యాఖ్య వివాదాస్పదమైంది.తానేమన్నా వెర్రిపువ్వునా అంటూ ఆయన మీడియా సమావేశంలోనే వ్యాఖ్యానించడం దుమారం రేపింది.గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ రోజున కూకట్పల్లి లో ఆయన కారుపై దాడి ప్రయత్నం జరగడం,అయితే మంత్రి తప్పించుకుపోవడం తెలిసిందే. అనంతరం మంత్రి స్పందిస్తూ తనపై బీజేపీ ప్రణాళిక ప్రకారం దాడి చేయించిందని ఆరోపించారు.తాను తన కళాశాలకు వెళ్తుండగా ఈ దాడి జరిగిందని చెప్పారు .అయితే ఓటర్లకు పంచేందుకు మంత్రి తన కారులో డబ్బులు తీసుకు వస్తున్నారన్న సమాచారం అందడంతో తాము ఆయన కారును అడ్డగించామని ఈ సందర్బంగా బీజేపీ వివరణ ఇచ్చింది.
దీనిపై మంత్రి స్పందిస్తూ పోలింగు రోజున క్యాబినెట్ మంత్రి ఎవరైనా తన కారులో డబ్బులు పెట్టుకుని తిరుగుతారా?నేనంత వెర్రిపువ్వు ను కాను అని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.ఆ పువ్వు పార్టీకే అలాంటివి చెల్లుతాయని ఆయన కమలం గుర్తు గా వెలిగిన బీజేపీని ఉద్దేశించి కామెంట్ చేశారు.అసలు మీడియాలో చూపుతున్న కారు తనది కాదని ఆ రోజు ఆ కారులో తను లేనని కూడా మంత్రి చెప్పారు. అంతేగాక తనను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసిన సీపీఐ నేత నారాయణ ను కూడా మంత్రి వదిలిపెట్టకుండా నారాయణ బిజెపిలో ఎప్పుడు చేరారంటూ సెటైర్ విసిరారు.మంత్రి వ్యాఖ్యలపై అటు బీజేపీ నేతలు, ఇటు సీపీఐ నారాయణ కూడా తీవ్రంగా స్పందించారు.పువ్వాడ అజయ్కుమార్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హెచ్చరించారు.
ఎవరు ఏ పువ్వో త్వరలోనే తేలుతుందని కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు.సీపీఐ నారాయణ కూడా మంత్రిని మర్యాదగా మెలగాలని సలహా ఇచ్చారు.తప్పులు ఎత్తి చూపితే మంత్రి కి ఉలుకెందుకని ప్రశ్నించారు.తన రాజకీయ పోకడలు, సీపీఐ తో ఉన్న కమిట్మెంట్ గురించి మంత్రి నాన్న పువ్వాడ నాగేశ్వరరావుకు కు బాగా తెలుసునని నారాయణ వ్యాఖ్యానించారు.పువ్వాడ అజయ్ కుమార్ తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు సీపీఐ లో సీనియర్ నాయకుడే కాకుండా ఆ పార్టీ శాసనసభాపక్షం నాయకునిగా కూడా వ్యవహరించ వ్యవహరించటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం తెలంగాణా రాజకీయంలో మంత్రి పువ్వాడ హాట్ టాపిక్ గా మారారు.