Child: పిల్లలకు పుట్టుకతో వచ్చే లక్షణం ప్రతిదాని గురించి కుతూహలం గా అడిగి తెలుసుకోవడం. మనం వద్దు అని చెప్తున్నా ఏదో ఒకటి కెలుకుతూ ఉండటానికి కారణం ఈ కుతూహలం.ప్రమాదం లేనంతవరకు వారి పరిశోధనలను మనం గమనిస్తూ ఉంటే సరిపోతుంది. వారిని అతిగా అదుపు లో పెట్టాలి అని అనుకుంటూ ఏది చేయనివ్వకపోతే… చివరకి కీ టాయ్స్ లా తయారవుతారు. మనం చేయాల్సింది ఏమిటంటే వారు చేసే పనులు, వాళ్ళ ను ఒక కంట కనిపెడుతూ ఉండాలి. మన రోజువారీ పనుల్లో వాళ్ళని కూడా భాగం చేయాలి. వాళ్లకు వచ్చే ప్రతి అనుమానం కి మనం ఓపికగా సమాధానం చెప్పాలి. అడిగే ప్రశ్నలను తీసిపారేయండి వివరించి చెబితే వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరిగి మరిన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు. విసుక్కుంటే ఇంకా అడగకుండా సందేహాలను అలాగే ఉంచుకుని.. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపరు. ఇది వారి మానసిక ఎదుగుదలకు అడ్డంకిగా మారుతుంది.
పిల్లలు అడిగే ప్రశ్నలకు ఓపికగా వివరంగా సమాధానాలు చెప్పాలి. తెలియకపోతే తెలుసుకొని మరి చెప్పాలి. అంతే కానీ కోప్పడటం చిరాకు పడటం వంటివి అస్సలు చేయకండి . అలా వాళ్ళు తెలుసుకున్న విషయం నుండి వాళ్ళు ఏం నేర్చుకున్నారు అనేది తిరిగి చెప్పమని అడగాలి.కొన్ని వారు తెలుసుకోగలిగిన విషయాలు అయితే వారినే తెలుసుకుని చెప్పమనాలి. పెయింటింగ్, చెస్, రక రకాల టాపిక్స్ మీద మాట్లాడడం , పుస్తక పఠనం వంటివి అలవాటు చేస్తే వాళ్ళు నెమ్మదిగా ప్రశ్నలు అడగడం తగ్గించి వారే తెలివి,తెలుసుకోవడానికి ఇష్టపడతారు. దానితో వాళ్ళ సృజనాత్మకత, పరిశోధన శక్తి పెరుగుతాయి.పిల్లలకు ఏది మంచి ఏది చెడు అని అర్ధం అయ్యేలా చెప్పడానికి మనం ఉన్నది… తప్ప, వాళ్ళు తెలియక చేసిన తప్పులు ఎత్తి చూపడానికి కాదు ని మరిచిపోవద్దు. నిజానికి పిల్లలు పుస్తకాలు చదువుతున్నారు అంటే అది ఎంతో గొప్ప విషయం. కేవలం టెక్స్ట్ బుక్స్ కాకుండా, పురాణాలు, ఇతిహాసాలు, కాశీమజిలీ, చందమామ కథలు, భట్టి విక్రమార్క కథలు చదవమని ప్రోత్సహించడం వల్ల అవి పరిశోధనా శక్తిని మరింత పెంచుతాయి.
పిల్లల ను ఎప్పుడు చదువు,ర్యాంక్ లకు మాత్రమే పరిమితం చేయకుండా… చెస్, బుక్ రీడింగ్, క్రికెట్, బ్యాడ్మింటన్, డ్రాయింగ్, డాన్స్, స్విమ్మింగ్, స్టోరీ టెల్లింగ్ ఇలా ఒక ఐదు లేదా ఆరు విషయాల మీద దృష్టి పెట్టెల చేస్తే ఏదో ఒక రంగంలో ఖచ్చితంగా రాణిస్తారు.
మనతో పాటు పిల్లలని పొలనికి తీసుకెళ్లడం, ఆఫీస్ కి తీసుకెళ్లడం, అనాధ ఆశ్రమాలకు తీసుకెళ్లడం, జంతువులు, పక్షులతో ఆడుకోవడం, దెబ్బలు తగలనివ్వండి, గెలుపు ఓటములు అలవాటు చేయడం ఇలా అన్నీ తెలిసేలా చేస్తే వాళ్ళు ధైర్యవంతులు గా మారతారు. ఒక ఛత్రపతి శివాజీ, అల్లూరి సీతారామరాజు, వల్లభాయి పటేల్, చంద్రబోస్, భగత్ సింగ్, లాంటి వీరుల తో పాటు స్వామి అరవింద్, రాజా రవి వర్మ స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, వంటి వ్యక్తుల గురించి రాజకీయాలు, మేధావులు, శాస్త్రవేత్తలు ఇలా అన్నిటి గురించి తెలుసుకునేలా చేయాలి. కేవలం ఇంజనీరింగ్, ఎంబీబీస్ లు మాత్రమే కాకుండా ప్రపంచంలో బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి అనేది వారికీ వివరించాలి .
.
పిల్లలు వారి పనులు వారే చేసుకునే విధంగా ప్రోత్సాహించాలి. సెలవులు వస్తే, మీరు చేసే వంటపని, ఇంటిపని,తోట పనుల లో పిల్లల సహాయం తీసుకుంటూ వారికి ఓపిగ్గా పనులు నేర్పించుకోవాలి.పనులు చేసేటప్పుడు ఆ పనులు తేలికగా ,తొందరగా చేయడానికి మార్గాలు ఖచ్చితంగా వెతుకుతారు. ఆ వెదకడం లో నే పరిశోధనాత్మక దృష్టి వస్తుంది. పిల్లలను అన్నిటికి దూరం గా కష్టం అనేది తెలియకుండా పెంచకూడదు. పిల్లలకు పరిసరాలను పరిశీలించే అవకాశం కలిగినప్పుడు మాత్రమే సమస్యలు, వాటి పరిష్కారానికి మార్గాన్ని తెలుసుకోగలుగుతారు.సమాజాన్ని తెలుసుకుంటూ పెరగడం ప్రతి ఒక్కరికి చాలా అవసరం.
ఇలా పెంచకపోవడం వలెనే పిల్లల్లో సమస్యలు ఎదుర్కొనే శక్తి లేక ఆత్మహత్య చేసుకోవడానికి కారణం
అవుతుంది అని అంటున్నారు నిపుణులు .