విజయవాడ, మార్చి 17: రిటైర్డ్ ఐపిఎస్ అధికారి (మాజీ సిబిఐ జెడి) వివి లక్ష్మీనారాయణ ఆదివారం జనసేన పార్టీలో చేరారు. స్థానిక రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పెద్ద సంఖ్యలో విచ్చేసిన జనసేన కార్యకర్తల మధ్య లక్ష్మీనారాయణ పార్టీలో చేరగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. లక్ష్మీనారాయణతో పాటు కృష్ణదేవరాయ యూనివర్శిటీ మాజీ ఉప కులపతి రాజగోపాల్ జనసేన పార్టీలో చేరారు. వీరిని పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వివి లక్ష్మీనాారాయణ మాట్లాడుతూ సమాజంలో మార్పు , ప్రజల అభ్యున్నతి కోసం పవన్ కల్యాణ్ ఆలోచన విధానం నచ్చి తాను జనసైనికుడిని అయ్యానని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మనం ముందుకు వెళదాం – దేశాన్ని మారుద్ధాం అని పిలుపు నిచ్చారు.
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వివి లక్ష్మీనారాయణ ఎంతో ఉన్నత భావాలు కల్గిన వ్యక్తి అన్నారు. లక్ష్మీనారాయణ లాంటి మంచి వ్యక్తులు చేరడం వల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుందనీ, సమాజంలో మార్పు తీసుకురాగలుతామన్న నమ్మకం కలుగుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు.