అమరావతి: రాబోయే రోజుల్లో జనసేన పార్టీ బాగా పుంజుకుంటుందని ఆ పార్టీ నాయకుడు, సిబిఐ మాజీ జెడి వివి లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న వివి లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఓడిపోయినా తనను 2,88,754మంది ఓటుతో దీవించారని ఇది సామాన్యమైన విషయం కాదని అన్నారు. 15రోజులలోనే ఈ విధమైన స్పందన ప్రజల నుండి వచ్చిందని అన్నారు. జనసేన ప్రతిపాదించిన జిరో బడ్జెట్ పాలిటిక్స్ యువతలోకి వెళ్లిందని లక్ష్మీనారాయణ అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్దం చేస్తున్నామని లక్ష్మీనారాయణ అన్నారు. సమీక్షా సమావేశంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పరిణామాలపై అందరితో చర్చించి తగు సూచనలు, సలహాలు అందిస్తున్నారనీ లక్ష్మీనారాయణ చెప్పారు.
ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని లక్ష్మీనారాయణ అన్నారు.
నిజాయితీగా ఎన్నికలు జరిగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని లక్ష్మీనారాయణ అన్నారు.
సమావేశంలో పార్టీ నేతలు తోట చంద్రశేఖర్, మాదాసు గంగాధరం తదితరులు పాల్గొన్నారు.