తిరుపతి: చిత్తూరు జిల్లాకు చెందిన టిడిపి ముఖ్య నేత సైకం జయచంద్రారెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బిజెపిలో చేరారు. సివిల్ సప్లైస్ కార్పోరేషన్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించిన సైకం జయచంద్రారెడ్డి శనివారం బిజెపి జాతీయ నేత రామ్ మాధవ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు ఐఎంఎ తిరుపతి మాజీ అధ్యక్షురాలు డాక్టర్ కృష్ణ ప్రశాంతి, పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కాషాయం కండువా కప్పుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలుగు రాష్ట్రాల్లో బిజెపి ఆపరేషన్ ఆకర్ష్ తెరలేపిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు పార్టీల నేతలను కాషాయ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాకు చెందిన నేతలు పలువురు పార్టీని వీడటం ఆ పార్టీ వర్గీయులను ఆందోళనకు గురి చేస్తున్నది. త్వరలో మరి కొందరు కూడా బిజెపి తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.
సార్వత్రిక ఎన్నికలకు ముందు సివిల్ సప్లైస్ కార్పోరేషన్ చైర్మన్ పదవికి, టిడిపికి చల్లా రామకృష్ణారెడ్డి రాజీనామా చేసి వైసిపిలో చేరిన అనంతరం ఆ పదవిని చిత్తూరు జిల్లాకు చెందిన సైకం జయచంద్రారెడ్డికి చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది. ఈ ఏడాది మార్చి తొమ్మిదిన ఆయన సివిల్ సప్లైస్ కార్పోరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?