Devineni Uma: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి YS Jagan mohan reddy మార్ఫింగ్ వీడియో ప్రసారం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి టీడీపీ TDP నేత దేవినేని ఉమామహేశ్వరరావు సీఐడీ CID అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు గురువారం మంగళగిరిలో సీఐడీ అదికారుల ముందు విచారణకు దేవినేని ఉమా హజరైయ్యారు. దాదాపు 9గంటలకు పైగా దేవినేని ఉమామహేశ్వరరావును సీఐడీ అధికారులు విచారించారు. మే 1వ తేదీన మరో మారు విచారణకు రావాల్సిందిగా ఉమాకు సీఐడీ అధికారులు సూచించారు. శుక్రవారం ఉదయం 9గంటలకు తగిన ఆధారాలను సమర్పించాలని దేవినేని ఉమాను సీఐడీ అధికారులు కోరారు.
అయితే విచారణ అనంతరం దేవినేని ఉమా సీఐడీ అధికారులపైనే ఆరోపణ చేశారు. చంద్రబాబే వీడియో ప్లే చేయించారని చెప్పాలని సీఐడీ అధికారులు ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్ Jagan తప్పుడు కేసులు పెట్టి తమ గొంతు నొక్కాలని చూస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పేరు చెబితే వదిలివేస్తామంటూ సీఐడి అధికారులు చెప్పారన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని అన్నారు. శుక్రవారం ఉదయం 9గంటలకు ట్యాబ్ తీసుకురావాలని చెప్పారన్నారు.
దేవినేని ఉమామహేశ్వరరావు ప్రదర్శించిన మార్ఫింగ్ వీడియోపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తొలుత రెండు పర్యాయాలు కర్నూలు సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని సీఐడీ అధికారులు ఉమామహేశ్వరరావుకు నోటీసులు అందజేశారు. అయితే దేవినేని ఉమామహేశ్వరరావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా విచారణకు స్వీకరించిన కోర్టు విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకూ సీఐడి అరెస్టు నుండి ఉమా ఊరట పొందారు. అయితే సీఐడీ విచారణకు హజరు కావాలని ఉమాకు హైకోర్టు సూచించింది.