కోడెల శివప్రసాదరావు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందారని ప్రచారం జరుగుతుండగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అది అవాస్తవమని పేర్కొంటున్నారు. కోడెల మెడపై గాట్లు ఉన్నాయని సోమిరెడ్డి చెబుతున్నారు. ఫౌండర్, చైర్మన్గా ఉన్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలోనే కోడెల తుదిశ్వాస విడవడం బాధాకరమని సోమిరెడ్డి అన్నారు. కోడెల మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నామనీ, పోస్టుమార్టం అనంతరం మాత్రమే ఆత్మహత్యను నిర్ధారించనున్నామని హైదరాబాద్ పశ్చిమ మండల డిసిపి శ్రీనివాస్ తెలిపారు. కోడెల గదిని స్వాధీనం చేసుకొని తనిఖీ చేశామనీ, ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదనీ ఆయన తెలిపారు.
వైసిపి వేధింపుల కారణంగానే కొడెల బలవన్మరణం పొందారని పలువురు టిడిపి నేతలు పేర్కొంటున్నారు. ఇది రాజకీయ హత్య అని టిడిపి నేత యరపతినేని శ్రీనివాసరావు ఆరోపిస్తుండగా, ఇది ఆత్మహత్య కాదు, జగన్మోహనరెడ్డి చేసిన దారుణ హత్య అని విజయవాడ ఎంపి కేశినేని నాని ట్వీట్ చేశారు.