అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ఛేదించి దోషులను గుర్తించేందుకు సిట్ అధికారులు దర్యాప్తు వేగాన్ని పెంచారు. వివేకానంద రెడ్డి హత్య జరిగి మూడు నెలలు దాటినా ఇంత వరకూ దోషులను గుర్తించలేదు.
వివేకా ఇంటి వాచ్మెన్ రంగయ్యకు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహిస్తే కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావించిన సిట్ అధికారులు అందుకు అడుగులు వేశారు. మొదటి సారి పాలిగ్రాఫ్ పరీక్షల అనుమతికి సిట్ అధికారులు పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దాన్ని తిరస్కరించింది. తర్వాత మరో సారి పిటిషన్ వేసినపుడు కోర్టులో వాచ్మెన్ రంగయ్య పరీక్షలకు అంగీకారం తెలపడంతో పరీక్షల నిర్వహణకు అనుమతి లభించింది. దీంతో సిట్ అధికారులు రంగయ్యను అదుపులోకి తీసుకొని పరీక్షలకు తరలించారు.
ఈ కేసులో సాక్షాధారాలను తారుమారు చేశారన్న అభియోగంపై ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాష్లను పోలీసులు అరెస్టు చేయగా ఇటీవలే వారు బెయిల్పై విడుదల అయ్యారు.
వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం నియమించిన సిట్ను రద్దు చేశారు. జిల్లా ఎస్పితో పాటు డిఎస్పి ఇతర అధికారులను బదిలీ చేసి నూతనంగా సిట్ ఏర్పాటు చేసిన విషయం విదితమే.
హత్యకు గురైన వివేకానంద రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి చినాన్న కావడంతో సిట్ అధికారులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని విచారణలో వేగాన్ని పెంచారు.