అమరావతి : తెలుగుదేశం పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. శాసనసభ టీడీపీ ఉప నేత మాజీమంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అరెస్ట్ జరిగి 24 గంటలు గడవక ముందే అనంతపురం జిల్లాకు చెందిన మరో కీలక నేత సోదరుడు మాజీ ఎమ్మెల్యే జెసీ ప్రభాకర్ రెడ్డిని, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్దిల అరెస్ట్ లు జరిగాయి. శనివారం ఉదయం హైదరాబాద్లోని వారి నివాసంలో జేసీ ప్రభాకర్ రెడ్దితో పాటు ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకొని అనంతపురంకు తరలించారు.
154 బస్సులు నకిలీ ఎన్ఒసీ, ఫేక్ ఇన్స్యూరెన్స్ కేసులో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తున్నది. బీఎస్ 3 వాహనాల విషయంలో కూడా వీరిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో వారిపై గతంలోనే కేసులు నమోదు అయ్యాయి.
కొద్ది రోజుల క్రితమే దివాకర్ ట్రావెల్స్ మేనేజర్ నాగేశ్వరరెడ్డి ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్రెడ్డితో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకు ముందు జేసీ ప్రభాకర్రెడ్డి ఇంటి ముందు లారీ ఓనర్లు ధర్నాకు దిగారు. లారీ ఇంజిన్ నంబర్లను అక్రమంగా వాడుకొని తమ లారీలు సీజ్ అయ్యేందుకు కారణం అయ్యారంటూ ప్రభాకర్రెడ్డిపై వారు ఆరోపణలు చేశారు.
టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి 24 గంటలు గడవక ముందే అదే పార్టీకి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్దిని ఆయన కుమారుడుని అనంతపురం పోలీస్ లు అరెస్ట్ చేయడం విశేషం. టీడీపీ అధికారంలో ఉండగా జెసీ ప్రభాకర్ రెడ్ది…వైఎస్ జగన్, వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం ప్రజలకు తెలిసిందే. ఈ అరెస్ట్ లపై టీడీపీ నేతలు రాజకీయ కక్ష సాధింపు చర్యలు అని ఆరోపిస్తుండగా టీడీపీ హయాంలో వారు చేసిన తప్పులకు చట్టం తన పని తాను చేసుకుపోతుందని, దీనిలో కక్ష సాధింపు అనే మాటలకు అర్ధం లేదని వైసీపీ నేతలు, మంత్రులు పేర్కొంటున్నారు. ఈ అరెస్ట్ ల పరంపరలో నెక్ట్ ఎవరి వంతు వస్తుందోనని రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా ఉంది.
అచ్చెన్నకు 14 రోజుల రిమాండ్
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడికి శుక్రవారం రాత్రి ఏసీబీ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే అనారోగ్య పరిస్థితి కారణంగా ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో అచ్చెన్నాయుడును తొలుత విజయవాడ సబ్ జైలుకు.. అనంతరం జైలు అధికారులు అనుమతితో జీజీహెచ్కు తరలించారు. కాగా ఇదే కేసులో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేశ్కుమార్కు కూడా రెండు వారాల రిమాండ్ విధిస్తూ ఏసీబీ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.