హైదరాబాద్: నయీం కేసులో సిబిఐ విచారణ జరిపితే అన్ని విషయాలు బయటకు వస్తాయని బిసి సంక్షేమ సంఘాల నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నయీం కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందువల్లే తన పేరు చార్జిషీటులో చేర్చారని కృష్ణయ్య ఆరోపించారు. తాను ఎలాంటి దందాలు చేయలేదని పేర్కొన్నారు. బిసిల పక్షాన పోరాడకుండా తనను అడ్డుకునేందుకు ప్రభుత్వం చేస్తున్నదని కృష్ణయ్య ఆరోపించారు. తాను కేవలం నయీం బాధితుల పక్షాన మాత్రమే మాట్లాడాననీ ఈ విషయాలను తాను అప్పట్లోనే చెప్పానని కృష్ణయ్య తెలిపారు. తన వద్దకు ప్రతి రోజు ఎంతో మంది వస్తుంటారనీ, వాళ్ల తరపున ఫోన్ చేసి నయీంను బెదిరించానని కృష్ణయ్య అన్నారు. నయీం డైరీని బయట పెట్టాలనీ, కేసులో దొరికిన డబ్బును బాధితులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.