(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కడప: అమరావతినే రాజధానిగా ప్రకటించే వరకూ అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి శాంతియుతంగా ఉద్యమాలు నిర్వహించాలని కడప జిల్లా అఖిలపక్ష నేతలు తీర్మానించారు. కడప జిల్లా రాజంపేటలో అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మాజీ ఎమ్మెల్సీ భత్యాల చెంగలరాయుడు మాట్లాడుతూ రాజధాని అమరావతిపై అధికార వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో కమ్మ సామాజిక వర్గానికి ఏడు శాతం కూడా భూములు లేవని తెలిపారు. గతంలో అమరావతిలో రాజధాని ఏర్పాటుకు నాటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసనసభలోనే ఆమోదం తెలిపారని అన్నారు. ఇప్పుడు జగన్ కెసిఆర్ డైరెక్షన్లో పని చేస్తూ ఏపి రాజధాని తరలించాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఏపిలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తెలంగాణకు అనుకూలంగా మారాయనీ, ఇదే విషయాన్ని తెలంగాణ మంత్రి హరీష్ రావు సభా ముఖంగా ప్రకటించిన విషయాన్ని చెంగలరాయుడు గుర్తు చేశారు.