న్యాయం.., నీతి.., నిజాయితీ ఇవన్నీ ఒకే అమ్మకి పుట్టిన బిడ్డలు. కలిసి ఒకే చోట ఉంటే సంతోషం ఉంటుంది..!! అయితే న్యాయం ఉన్న ప్రతీ చోట నీతి, నిజాయితీ ఉంటుందన్న నమ్మకం లేదు. అలా ఉంటేనే మాంచి కిక్కు ఉంటుంది..!! అలాగే నీతి, నిజాయితీ ఉన్న చోట న్యాయం ఉంటుందన్న నమ్మకమూ లేదు. న్యాయం దారి వేరు. అది చట్టం, కోర్టులు, రాజ్యాంగం అనే సూత్రాల ప్రాతిపదికన పని చేస్తుంది. న్యాయాన్ని నీతి లేకుండా వాడుకోవడంలో కొందరు రాజకీయ నాయకులూ ముందుంటారు. తాజాగా ఓ కేసుని మనం ఉదాహరణగా పేర్కొనవచ్చు.
ఆ మాజీ ఎంపీకి ఏం పనీ, పాటు ఉండదేమో. ఎక్కడ ఏ కేసు ఉన్న, ఎక్కడ ఏం జరిగినా వాలిపోతారు. తానున్నానన్నట్టు బిల్డప్ ఇస్తుంటారు. రాజకీయంగా వాడేసుకుంటారు. అందుకే ఆయన అమలాపురం నుండి చీరాల వెళ్లి ఓ కేసుని కనుక్కుని, ఇప్పుడు కోర్టుకి వెళ్లారు. కోర్టుకి వెళ్లడం మంచిదే కానీ.., ఆ తల్లిదండ్రుల అనుమతి తీసుకుని వెళ్లడం కనీస ఇంగితం అనే ఆలోచన లేకుండా వెళ్లడమే ఆ మాజీ ఎంపీకి రాజకీయ వ్యవహారం.
చీరాల కిరణ్ వ్యవహారం గుర్తుందిగా..??
చీరాలకి చెందిన కిరణ్ రెండు నెలల కిందట మరణించారు. పోలీసులు కొట్టిన కారణంగానే కిరణ్ మరణించారనేది ఓ వర్గం వాదన. లేదు కిరణ్ పొలిసు జీపు నుండి దూకేసిన కారణంగా మరణించాడు అనేది పోలీసుల వాదన. దీనిలో నిజాలు తేల్చే క్రమంలో ఇప్పటికీ విచారణ జరుగుతుంది. ఏ ఘటనకు ప్రధాన కారకుడిగా ఆరోపణలు ఉన్న ఎస్సైని కూడా సస్పెండ్ చేసారు. ప్రభుత్వం ఈ ఘటనపై అన్ని విధాలుగా స్పందించింది. విషయం తెలిసిన వెంటనే చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తో సీఎం జగన్ మాట్లాడారు,వివరాలు తెలుసుకుని ప్రభుత్వం తరపున రూ. 10 లక్షలు సాయం అందించారు. జిల్లా అధికారులను, రాష్ట్ర ఎస్సి ప్రజా ప్రతినిధుల కమిటీని కిరణ్ ఇంటికి పంపించారు. కుటుంబాన్ని ఓదార్చారు, భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరపున చేయాల్సినవి చేస్తూనే, విచారణ కూడా కీలక దశకు చేరింది.
ఎథికల్ పాయింట్..! మాజీ ఎంపీకి ఏం సంబంధం..!!?
మాజీ ఎంపీ హర్ష కుమార్ అందరికీ తెలిసిన పేరు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ, వైసీపీ అంటూ తిరిగినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నారు. అందుకే రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా..? ఎటువంటి ఇష్యూ ఉన్నా వెంటనే వాలిపోయి తనకు ఏంటి అని ఆలోచించే టైపు. ఆయనకు ఓ లాయర్ శ్రావణ్ కుమార్ తోడయ్యారు. పైన చెప్పుకున్న చీరాల కిరణ్ కేసుని సీబీఐకి అప్పగించాలని కోర్టులో పిల్ వేశారు. అంటే తప్పు లేదు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి అంటే కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరగాలి అని కోరడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ ఆ కిరణ్ తల్లిదండ్రుల అనుమతి లేకపోవడమే కీలక పాయింటు.* న్యాయ సూత్రాల ఆధారాంగా చూస్తే ఆ తల్లిదండ్రుల అనుమతి అవసరం లేదు. ఎక్కడి కేసుని, ఎవరైనా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఎథికల్ గా ఆలోచిస్తే ఆ తల్లిదండ్రుల అనుమతితో వేయడం సబబు.
గతంలో వద్దు అనుకుని మళ్ళీ..!!
జులై 21 న కిరణ్ మరణించారు. జులై నెలాఖరు నాటికే ప్రభుత్వం తరపున కొన్ని ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఆగష్టు 15 వరకు ఆ కుటుంబానికి ఓదార్పులు, పరామర్శలు జరుగుతూనే ఉన్నాయి. అప్పట్లోనే హర్ష కుమార్ తరపున లాయర్ శ్రావణ్ కుమార్ సిబిఐ విచారణ కోరుతూ కోర్టులో పిటిషన్ వేయడానికి తల్లి దండ్రులను ఒప్పించారు. అయిష్టంగానే అంగీకరించిన ఆ తల్లిదండ్రులు ఆ తర్వాత దీనిలోని రాజకీయ కోణాలను అలోచించి వాపసు చేయించారు. “మీరు మీ రాజకీయ స్వార్ధం కోసమే వేస్తున్నారు. మీ ప్రయోజనాలకు మమ్మల్ని లాగొద్దు” అంటూ పిటిషన్ ని వాపసు తీసుకున్నారు. ఇది జరిగిన నెల తర్వాత మళ్ళీ తాజాగా హర్ష కుమార్ తరపున శ్రావణ్ కుమార్ కోర్టులో పిటిషన్ వేయడం.., దీనికి కనీసం ఆ తల్లి దండ్రులకు సమాచారం ఇవ్వకపోవడం, అనుమతి తీసుకోకపోవడం.. వారి రాజకీయ ఉద్దేశాలను అద్దం పడుతుంది. అందుకే ఎవరి మరణం..? ఎక్కడి కేసు..? ఎందుకీ రాజకీయం..??