అమరావతి: సిబిఐ, యూనియన్ బ్యాంక్లు తమపై తప్పుడు కేసులు పెట్టాయని టిడిపి నేత, మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు పేర్కొన్నారు. నిన్న రాయపాటి నివాసంతో పాటు వివిధ ప్రాంతాల్లోని వారి కార్యాలయాలపైనా సిబిఐ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన వివరణ ఇస్తూ ట్రాన్స్ ట్రాయ్ నిధులను తాము ఎక్కడికీ బదిలీ చేయలేదన్నారు.
ట్రాన్స్ ట్రాయ్ అప్పుల్లో కూరుకుపోయిన విషయం వాస్తవమేనని రాయపాటి చెప్పారు. తమకు రావాల్సిన నిధులు వేల కోట్లలో ఉన్నాయని పేర్కొన్నారు. తమ కంపెనీ తక్కువ కాలంలో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. పోలవరం ప్రాజెక్టు తమ నుండి వెళ్లిపోవడంతో భారీ నష్టం వాటిల్లిందని అన్నారు. ట్రాన్స్ ట్రాయ్ని సిఈఒ శ్రీధర్ చూసేవారని రాయపాటి చెప్పారు. కంపెనీ రోజు వారీ కార్యకలాపాలకు తనకు సంబంధం లేదనీ, కంపెనీలో ఏం జరుగుతుందో తనకు తెలియదనీ ఆయన పేర్కొన్నారు. తాను బ్యాలెన్స్ షీట్ల మీద తప్ప ఎక్కడా సంతకాలు చేయలేదని రాయపాటి వెల్లడించారు. ట్రాన్స్ ట్రాయ్ మాత్రం తప్పు చేయదని తాను నమ్ముతున్నానని అన్నారు.