Janasena-Tdp: జనసేన-టీడీపీ Janasena-Tdp: రాష్ట్రంలో వైసీపీ సొంతంగానే అధికారంలోకి వచ్చేంత బలం ఉందని 2019 ఎన్నికలు నిరూపించాయి. రెండేళ్ల తర్వాత కూడా వైసీపీ బలమేంటో.. బ్యాలెట్ ఓటింగ్ జరిగిన మున్సిపల్ ఎన్నికలు నిరూపించాయి. ఏపీ పొలిటికల్ వీల్ లో వైసీపీ అంత స్ట్రాంగ్ బేస్ మరెవరికీ లేదని స్పష్టమైపోయింది. తెలంగాణలో టీడీపీ పూర్తిగా చతికిలపడితే.. ఏపీలో పరిస్థితి ఏమీ చెప్పలేనట్టు ఉంది.
బీజేపీ గురించి నేతలు చెప్పుకున్నంతగా ప్రజల్లో బలం లేదని మొన్నే తేలిపోయింది. మిగిలింది జనసేన. ఇప్పుడు ప్రతి పార్టీ లక్ష్యం పవన్ తో కలిసి వెళ్లడం.. జనసేనతో పొత్తు ఆలోచించడం.. పవన్ క్రేజ్ ను ఉపయోగించుకోవడం. ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్న జనసేనను టీడీపీ తనవైపుకు లాక్కునే ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.
ఇటివల జరిగిన రాజకీయ పరిణామాలే ఇందుకు నిదర్శనమని తెలుస్తోంది. తెలంగాణలో బీజీపీతో దాదాపు కటీఫ్ చెప్పేసిన పవన్ ఏపీలో కూడా ఇందుకు సిద్ధంగా ఉన్నారనే ఊహాగానాలు ఉన్నాయి. తిరుపతి ఎంపీ టికెట్ ఆశించిన జనసేనకు బీజేపీ అడ్డుపడి తన అభ్యర్ధినే నిలుపుతోంది. జనసేన మద్దతుతో ముందుకెళ్తామని బీజేపీ స్పష్టం చేసింది. అయితే.. జనసేన నుంచి మాత్రం పెద్దగా ప్రకటనలు, జనసైనికుల నుంచి ఉత్సాహం, పవన్ నుంచి ప్రోత్సాహం అయితే కనపడటం లేదు. దీంతో జనసేన-బీజేపీ మైత్రిపై అనేక ప్రశ్నలు నెలకొన్నాయి. ఇదే ఇప్పుడు టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకుంటోందని వార్తలు వస్తున్నాయి. ఇందుకు టీడీపీ మాజీ ఎంపీ ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది.
ఇటివలి మున్సిపల్ ఎన్నికల్లో అనంతపురం తాడిపత్రిలో జేసీ సోదరులు తమ హవా నిలబెట్టుకున్నారు. ఇదే సమయంలో వైసీపీని ఢీకొట్టడం ఎంత కష్టమో కూడా వారికి తెలిసింది. దీంతో టీడీపీకి జనసేనను దగ్గర చేసే ఆలోచనను చిరంజీవితో దివాకర్ రెడ్డి పంచుకున్నారని తెలుస్తోంది. ఇటివల హైదరాబాద్ వెళ్లిన జేసీ చిరంజీవిని కలిశారని అంటున్నారు. జనసేన బలపడాలన్నా.. వైసీపీకి చెక్ పెట్టాలన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఒక్క పార్టీ వల్ల కూడా కాని పని అని చెప్పారట. దీంతో టీడీపీతో కలసి వెళ్తే వైసీపీకి ఓడించగలమనే చెప్పారట. దీనిపై పవన్ తో చర్చించాలని కూడా సూచించారని సమాచారం. మరి.. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే..!