అనుమానం పెనుభూతం అంటుంటారు. అనుమానం వచ్చిన వ్యక్తి ఎంతటి దూరమైనా వెళ్తాడు. మన వాళ్ళను మనం నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు. అయితే ఒక శాడిస్ట్ భర్త అనుమానంతో భార్యకు చుక్కలు చూపించాడు. నిరంతరం వేధించాడు. తను లేని సమయంలో ఇంటికి ఎవరో వస్తున్నారని నిత్యం అనుమానించేవాడు. అతను ఎవరని ప్రశ్నలతో చిత్రవధ చేసేవాడు. నీ బాయ్ ఫ్రెండ్ తో ఎప్పుడు లేచిపోతున్నావు అంటూ అర్ధం పర్ధం లేని ప్రశ్నలతో తూట్లు పొడిచేవాడు.
గుజరాత్ లోని వడోదరలో నివాసముంటున్న మాజీ నావికాధికారి ఈ విధంగా భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. మానసికంగా ఆమెను వేధించాడు. చివరకు కన్న కూతురు చెప్పినా వినలేదు. అతని భార్య పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ కోసం ముంబై వెళ్ళింది. అప్పట్నుండి అతని అనుమానం రెట్టింపైంది. ఇంటి మొత్తాన్ని సీసీ కెమెరాలతో నింపేసాడు.
ఎవరైనా సిసి కెమెరాకు అంటే హాల్, కిచెన్, బాల్కనీ అలాంటి చోట్ల పెడతారు. ఈ మహానుభావుడు తన అనుమానంతో బెడ్ రూమ్, బాత్ రూమ్ లలో కూడా సిసి కెమెరాలను అమర్చాడు. దీంతో భార్య, కూతురు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సిసి కెమెరాలను కనీసం బెడ్ రూమ్, బాత్ రూమ్ లలో అయినా తీయమని ప్రాధేయపడ్డారు.
ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. భార్య మొబైల్ ఫోన్ ను పగలకొట్టాడు ఆ ప్రబుద్దుడు. భార్య ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ వంటివి కూడా తన వద్దే ఉంచుకున్నాడు. ఈ చర్యలతో విసిగిపోయిన ఆమె చివరకు పోలీసులను సంప్రదించింది. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో కోర్టును ఆశ్రయించింది. కోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే బాధితురాలికి ఆమె పిల్లలకు కలిపి నెలకు 40,000 రూపాయలు వారి అవసరాలకు చెల్లించాలని తీర్పునిచ్చింది. వారిని ఇబ్బంది పెట్టవద్దని వారించింది.